మిర్యాలగూడ, డిసెంబర్13 : ప్రస్తుత సమాజంలో ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని శివాణి టెక్నో స్కూల్లో నిర్వహించిన అల్లం కిరణ్ 15వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
శాస్త్రీయ దృక్పథం లేని సమాజం అధోగతి పాలవుతుందన్నారు. శాస్త్రీయ పురోగతితో ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయని, వాటిని పునికి పుచ్చుకొని భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విద్యార్థులను ఆ వైపునకు ప్రేరేపించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.
కార్యక్రమంలో అల్లం కిరణ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కేతనపల్లి శ్రీనివాస్రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అంబటి సురేందర్రాజు, కార్టూనిస్ట్ శంకర్, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, అంబటి నాగయ్య, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు కుందూరు శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.