యాదగిరిగుట్ట, మార్చి 12 : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఈ నెల 19 వరకు స్వామివారి అలంకార సేవోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. స్వామివారి మరో రూపమైన నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో విశేష పర్వ దినాల్లో వివిధ రకాల అలంకార సేవలను నిర్వహిస్తారు. స్వామివారు వేదరక్షణ కోసమై మత్స్యావతారాన్ని ఆది కల్పనలో అవతరించాడు.
లక్ష్మీనారసింహుడు పట్టుపీతాంబరాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకృతుడై దశావతారాల్లో ఉదయం, సాయం త్రం వేళల్లో వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు. మంగళవాయిద్యాలు, వేద మంత్ర పఠనాల నడుమ తిరుమాఢవీధుల్లో ఊరేగుతారు. అలంకార సేవలను వెలుపలి ప్రాకార కల్యాణ మండపంలో ముస్తాబు చేసి పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. ఉత్తర, తూర్పు, దక్షిణ మాఢవీధుల్లో ఊరేగించి పశ్చిమ భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేంచేపు మండపంలో ఆస్థానం చేసి అలంకార విశిష్టతకు ప్రధానార్చకులు వినిపిస్తారు. భక్తుల సందర్శనార్థం ఉంచి అర్చకులు వేదమంత్రాలను పఠిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో విహార పర్వాలు స్వామివారికి ఎంతో ప్రీతికరం. అందుకే స్వామివారి మొదటి అవతారమైన మత్స్యవతారం అలంకారసేవను 13న బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవితో భగవంతుడు ఆది శేషుడిపై విహరిస్తూ తీర్థ జనానికి ఆహ్లాదాన్ని అందించే అలంకారోత్సవాలు శేషవాహనంపై రాత్రి 7 గంటలకు ఊరేగిస్తారు.
సృష్టి ప్రారంభ దశలో మర్రి ఆకుపై పవళించిన విష్ణుమూర్తి అవతారాన్ని వటపత్రశాయుడిగా కొలుస్తారు. జగత్ రక్షకుడిగా గురువారం ఉదయం 9 గంటలకు లక్ష్మీనరసింహుడు దర్శనమిస్తారు. ఈ దర్శనం కలి ప్రభావం సోకకుండా మోక్షం ప్రాప్తిస్తుంది. నీటిని, పాలను వేరుచేసే హంస వాహనంపై రాత్రి 7 గంటలకు శ్రీస్వామివారు విహరిస్తూ జ్ఞాన బోధన చేస్తారు.
భగవంతుడి అవతారాల్లో శ్రీకృష్ణుడి(మురళికృష్ణుడు) అవతారం ద్వాపర యుగ పురుశుడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణాలంకార సేవను శుక్రవారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. కోరికలు తీర్చే పొన్న వాహన సేవపై యాదగిరీశుడు అలంకృతుడై రాత్రి 7 గంటలకు విహరిస్తారు.
దేవతా గర్వాన్ని అణిచేందుకు గోవర్ధనగిరిధారిగా అవతరించిన పర్వాన్ని నిర్వహిస్తారు. ఇంద్రుడి గర్వాన్ని అణిచి లోకానికి నేను అండగా ఉంటానని చాటిచెప్పే అలంకార సేవోత్సవాన్ని శనివారం ఉదయం 9 గంటలకు చేపడతారు. సింహ వాహన సేవోత్సవాన్ని రాత్రి 7 గంటలకు నిర్వహిస్తారు.
ప్రకృతి పరంగా అందే ఫలాలు కృషి చేసిన వారికే దక్కాలన్నది జగన్మోహిని అవతార ఉద్దేశం. ఈ సేవలో ఆదివారం ఉదయం 7 గంటలకు స్వామివారు దర్శనమిస్తారు. అసురుల నుంచి సురులకు అమృతాన్ని అందజేసిన విశిష్టతే జగన్మోహిని అలంకార సేవోత్సవం. చంచలగుణం కలిగినది అశ్వం. ఆ అశ్వాన్ని అదుపులో ఉంచేందుకు స్వామి అశ్వ వాహనదారుడైన రాత్రి 8.45 గంటలకు విహరిస్తా రు. తిరుకల్యాణంలో ప్రధాన ఘట్టమైన ఎదుర్కో లు ఉత్సవాన్ని అశ్వ వాహన సేవపైనే నిర్వహిస్తారు.
జ్ఞానం ఒకరి సొత్తు కాదని చెప్పే శ్రీరామలంకార (హనుమంత వాహన సేవ) సేవలకు స్వామివారు సోమవారం ఉదయం 9 గంటలకు వేంచేస్తాడు. రాత్రి 8.45 గంటలకు గజేంద్ర మోక్షానికి తార్కాణంగా గజవాహనంపై లక్ష్మీనరసింహుడు కల్యాణోత్సవానికి వస్తాడు.
గరుడ ఆళ్వారుడిని వేద స్వరూపుడంటారు. కర్మ, జ్ఞానం బోధించే లక్ష్యంతో నారసింహుడు మహావిష్ణువు అలంకరణలో గరుఢవాహనంపై మంగళవారం ఉదయం 9 గంటలకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవంపై ఊరేగుతూ కనువిందు గొల్పుతాడు. మోక్ష ప్రాప్తికి ఈ సేవోత్సవం నిదర్శనమని వేద పండితులు చెబుతుంటారు.