– మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నీలగిరి, మే 17 : కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఉల్లాస్'” కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్ ఓబిలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమె మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళలు, నిరక్షరాస్యులకు చదవడం, రాయడం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించన్నుట్లు తెలిపారు.
ప్రతి మహిళ అక్షరాస్యురాలిగా మారడం ద్వారానే సమాజంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమని తెలిపారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఆన్లైన్ బిల్లుల చెల్లింపు, బ్యాంక్ ఖాతాల నిర్వహణ, పొదుపు అలవాట్లు, ఏటీఎం వినియోగం వంటి అంశాలలో అవగాహన పెంపొందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడతారని పేర్కొన్నారు. ప్రతి మహిళ చదువుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ, ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు.
మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చట్టపరమైన అవగాహన, పౌర హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, పొదుపు అలవాట్లు పెంపొందించడం, ఏటీఎం వినియోగం, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మెప్మా డీడీ అనిల్ కుమార్, డీఎంసీ శివాజీ, టీఎంసీ శ్రీనివాస్, సి.ఓలు, అనిల్కుమార్, జ్యోతి, సీఎల్ఆర్పీలు, ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్ఎబీ పాల్గొన్నారు.

‘నల్లగొండ కార్పొరేషన్లో సంపూర్ణ అక్షరాస్యతకు ప్రత్యేక చర్యలు’