యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 15 : కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ-చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ ఏర్పాటుతో పాటు తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా, ఇంకా కొందరు ఏకంగా మాస్క్ వేస్తున్నారు. రోడ్డుపై ఈ తరహా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లే అధికమయ్యాయి. దీని నుంచి చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టి భారీగా కేసులు నమోదు చేసింది.
ఇటీవల నేరస్తులు నేరాలు చేసే క్రమంలో ముందస్తుగా ఎక్కడో ఒక చోట వాహనాన్ని దొంగలించడం, నంబర్ ప్లేట్ మార్చడం, కనబడకుండా అంకెలను చెరిపివేయడం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల కొన్ని సార్లు భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు కష్టమయ్యే ప్రమాదం ఉండడంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా ప్లేట్ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలవొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నంబర్ ప్లేట్ సరిగ్గా ఉంచుకోకవపోడం, వంచడం, లేకపోవడం, అంకెలు చెరిపివేయడం చేసిన ఘటనలో యాదాద్రి భువనగిరి ట్రాఫిక్ పోలీసులు ఈ జోన్లోని యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10,398 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎన్.సైదులు, ఏసీపీ ట్రాఫిక్, యాదాద్రి భువనగిరి