నల్లగొండ సిటీ, అక్టోబర్ 11 : ఆర్టీసీ వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుకుంటున్నది. ఇటీవలి కాలంలో పండుగలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణికుల ఆదరణ పొందుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ప్రవేశపెట్టడంతో ఒక్కరోజే రూ.1.75 కోట్ల ఆదాయంతోపాటు 105 ఓఆర్ సాధించిన నల్లగొండ రీజియన్.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రీజియన్లో 7 డిపోలకు గాను 6 డిపోలు వందకు పైగా ఓఆర్ సాధించి రికార్డు సృష్టించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని దసరా, బతుకమ్మ పండుగలకు అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 13నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో పాఠశాల విద్యార్థుల కోసం 13, 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కాలేజీలకు 19 నుంచి సెలవులు ఉండంతో 20, 21, 22, 23 తేదీల్లో రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు. తిరిగి ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయా డిపోల నుంచి హైదరాబాద్కు అదనపు బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో పెట్టుకొని బస్సులు నడపడానికి ఆర్టీసీ కసరత్తు చేస్తున్నది.
హైదరాబాద్ నుంచి ఇలా..
హైదరాబాద్ నుంచి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సాగర్ రింగ్ రోడ్డులో ఆర్టీసీ ఆధికారులు అందుబాటులో ఉంటారు. వారు రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిస్తారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, నార్కట్పల్లి, సూర్యాపేట మార్గంలో బస్సులు నడుపనున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి యాదగిరిగుట్టకు, ఐఎస్ సదన్ నుంచి దేవరకొండ, సాగర్ ప్రాంతాలకు బస్సులు నడుపుతారు. హైదరాబాద్ నుంచి కోదాడ మార్గంలో వెళ్లే బస్సుల్లో సగం గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్ ప్రాంతాల ప్రయాణికుల కోసం మిర్యాలగూడ మీదుగా నడిపిస్తారు. మరి కొన్ని సూర్యాపేట మీదుగా నడువనున్నాయి.
డిపోల వారీగా అదనపు బస్సులు..
నల్లగొండ డిపో నుంచి 77, నార్కట్పల్లి 16, దేవరకొండ 69, మిర్యాలగూడ 61, కోదాడ 60, సూర్యాపేట 73, యాదగిరిగుట్ట డిపో నుంచి 29 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
సాధారణ చార్జీలే..
రోజు మాదిరిగానే ప్రత్యేక బస్సులకు కూడా సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేసేది లేదని, దానికితోడు బహుమతులు కూడా అందజేయనున్నామని చెప్తున్నారు. ఈ నెల 21నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులు
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులు ఏర్పాటు చేశాం. పండుగలకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. తిరుగు ప్రయాణంలో కూడా రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తాం. బహుమతులు కూడా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. లక్కీ డ్రా కూపన్ కోసం టిక్కెట్ వెనుక పేరు, ఫోన్ నెంబర్ రాసి బాక్స్లో వేయాలి.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం