కోదాడ, సెప్టెంబర్ 16 : బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం నిర్వహించేది కమ్యూనిస్టులే.. ప్రతిపక్షంగా నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల వెలుపల ఉద్యమాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులు బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ మేళ్లచెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ, దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కష్టాలకు, నష్టాలకు ఓర్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా పేద ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా వారసులేనన్నారు. వామపక్ష పార్టీలతో తనకు మూడు దశాబ్దాల అవ్యాజనుబంధం ఉందన్నారు. విద్యార్థి దశ నుంచి అంచలంచెలుగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన ఆదర్శప్రాయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఆయన కొనియాడారు.
ఆయనతో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని నల్లగొండ జిల్లా సమస్యలతో పాటు దేశ సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో వాడిగా వేడిగా వినిపించిన చరిత్ర సురవరంకు ఉందన్నారు. తన జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరించిన నికార్సైన నేత అన్నారు. రూ.1,800 కోట్లతో ఆయన కలలుగన్న డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి తాను, తన సతీమణి పద్మావతి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని, సన్న బియ్యం పథకం దేశంలోనే ఎక్కడా అమలు చేయడం లేదని ఈ పథకం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.
Kodada : కమ్యూనిస్టుల బలోపేతంతోనే సమాజాభివృద్ధి : మంత్రి ఉత్తమ్
అఖిల భారత విద్యార్థి సంఘం నాయకుడిగా. యువజన నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అనుబంధ సంఘాల బాధ్యుడిగా తన నిబద్దతతో అంచెలంచెలుగా ఎదిగి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి వామపక్ష ఉద్యమాలకు దిక్సూచి అని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. సురవరం సంతాప సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వ నేతగా తన తుది శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడని కొనియాడారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కును చట్టం ఏర్పాటులో కీలక భూమి పోషించినట్లు తెలిపారు. వామపక్ష పార్టీల కలయికను ఆయన ఆకాంక్షించారని, అందుకు కొంత ప్రయత్నం కూడా చేశారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే మనమిచ్చే నివాళి అని పల్లా పేర్కొన్నారు.
నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి పార్లమెంటు సభ్యుడిగా సురవరం ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ నెల్లికింటి సత్యం మాట్లాడుతూ..విద్యార్థి దశ నుంచి జాతీయస్థాయికి ఎదిగిన నిబద్ధత కలిగిన నేత సురవరం అన్నారు. బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిపిఐ నాయకులు గన్న చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభాకర్, మేకల శ్రీనివాసరావు, బద్దం కృష్ణారెడ్డి, హనుమంతరావు, ధనుంజయ నాయుడు, ఉస్తేల సృజన, మండలం వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, మల్లీశ్వరి, భద్రారెడ్డి, సిపిఎం నాయకులు ములకలపల్లి రాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు పాల్గొన్నారు.
Kodada : కమ్యూనిస్టుల బలోపేతంతోనే సమాజాభివృద్ధి : మంత్రి ఉత్తమ్