కోదాడ, జులై 02 : కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియాలో ఉన్న డబ్బా కొట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ.. తాము గత 30 సంవత్సరాలుగా చిన్న, చిన్న డబ్బా కోట్లు ఏర్పాటు చేసుకుని కుట్టు మిషన్లు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికిప్పుడు తమను ఖాళీ చేయిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ రాత పూర్వకంగా నూతనంగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో తమకు షాపులు కేటాయిస్తామని హామీ ఇస్తే సహకరించి ఖాళీ చేస్తామన్నారు. లేని పక్షాన బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే అందరం కలిసి అడ్డుకుంటామని పేర్కొన్నారు.