– టీపీటీఫ్ దేవరకొండ డివిజన్ కమిటీ
దేవరకొండ రూరల్, ఆగస్టు 21 : ఈ నెల 11న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున గ్రామర్ హైస్కూల్ కరెస్పాండంట్ కల్లు రూపారెడ్డిని అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఇద్దరు కలిసి పాశవికంగా హత్య చేయడమనేది సభ్య సమాజం, విద్యా వ్యవస్థనే తలదించుకునేదిగా ఉందని, ఈ సంఘటన ని తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ ఫోరమ్ తీవ్రంగా ఖండిస్తుందని దేవరకొండ డివిజన్ టీపీటీఫ్ అధ్యక్షుడు ఎండీ.రంజాన్ బేగ్ అన్నారు. నేడు విద్యార్థుల మానసిక వికాసం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర, కేంద్ర విద్యాశాఖలు కొత్త చట్టాలను తీసుకు రావాలని కోరారు.
అటు తల్లిదండ్రులు ఇటు మేధావులు, అధికారులు తక్షణమే విద్యార్థుల తీరుతెన్నులపై మానసిక వికాస అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. మనో వికాస నిపుణుల చేత సదస్సులు నిర్వహించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇది అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి లచ్చిరామ్ నాయక్, బొడ్డు వెంకటరమణ, అన్వర్, హుస్సేన్, మెరుగు శ్రీను, వెంకట్రాం, నగేష్, మహేందర్, అబ్దుల్ రజాక్, ఏడుకొండలు, మహేందర్, జకీర్ పాల్గొన్నారు.