మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యాన్ని చేరువ చేసింది. ఇక ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ పేరుతో ఎంపిక చేసిన పీహెచ్సీలలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయిస్తున్నది. ఆరోగ్య లక్ష్మి పేరుతో గర్భిణులను ఇంటి నుంచి 102, 108 వాహనాల్లో తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయడంతోపాటు భోజనం అందిస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఆరు పీహెచ్సీలలో ఇప్పటివరకు 14,910 మందికి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీని ద్వారా మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం మరో ఐదు పీహెచ్సీలను ఆరోగ్య మహిళకు ఎంపిక చేసింది. క్షేత్రస్థాయిలో అశ కార్యకర్తలు, మండలస్థాయిలో సూపర్వైజర్లు మహిళా రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నారు.
నీలగిరి, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వారు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా.. ముందస్తుగానే గుర్తించి రక్షించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఆరు పీహెచ్సీలను ఎంపిక చేసి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య మహిళ ద్వారా ఇప్పటి వరకు 14,910 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విషేష స్పందన రావడంతో జిల్లాలో మరో ఐదు పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో మహిళల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండడంతో అదననంగా మరో ఐదు పీహెచ్సీలను కూడా ఎంపిక చేశారు. కలెక్టర్ ఆర్వీ క ర్ణన్ కూడా వైద్యారోగ్యశాఖ, ఐసీడీఎస్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు శాఖలను సమన్వయం చేస్తూ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థ్ధాయిలో ఆశ కార్యకర్తలను, మండల స్థ్ధాయిలో సూపర్వైజర్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేట్టారు. ప్రతి పీహెచ్సీలో ఏఎన్సీ చెకప్కు గర్భిణులు వచ్చేలా వారిని చైతన్య పరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 102, 108 వాహనాల ద్వారా గర్భిణులను పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు వారికి తిరిగి క్షేమంగా ఇంటివద్దకు దింపుతున్నారు. దాంతో 90శాతం మహిళలు పీహెచ్సీల్లోనే వైద్యపరీక్షలు చేసుకుంటుండడంతో ఆయా కేంద్రా ల్లో సందడి నెలకొంది.
మార్చి 8న జిల్లాలోని ఆరు పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. ఆ పీహెచ్సీల్లో ప్రతి మంగళవారం కేవలం మహిళలకే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 35 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ ఆరోగ్య నివేదిక తయారు చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మహిళలు మెడికల్ ఆఫీసర్లుగా ఉన్న మరో ఐదు పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలోని శాలిగౌరారం, మునుగోడు, వీటీనగర్, ఓగోడు, చండూరు పీహెచ్సీలను దీని కోసం ఎంపిక చేశారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. జిల్లాలోని ఆరు పీహెచ్సీల్లో మార్చి 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. 26 వారాల పాటు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 14,910 మంది మహిళలకు పరీక్షలు చేశారు. ఇందులో 11,200 మందికి శ్వాస, గొంతు సంబంధిత పరీక్షలు నిర్వహించారు. 1416 మందికి గర్భాశయానికి సంబంధించిన పరీక్షలు చేయగా అందులో 185 మందికి పలు రకాల సమస్యలు ఉన్నట్లు తేల్చారు. 1552 మందికి యూరిన్టెస్ట్ చేయగా 12 మందికి మూత్రకోశ వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. 14910 మందిలో 3,262 మంది మహిళల నక్త నమునాలను టీ హబ్కు పంపి పరీక్షలు చేశారు. ఇక్కడ పలు సమస్యలు ఉన్నట్లు తేలడంతో మరింత క్లారిటి కోసం 1521 మందిని జిల్లా జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేయగా 1201 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 5231 మంది షుగర్, 6852 మందికి బీపీ, 652 మందికి థైరాయిడ్, నలుగురికి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. ఇద్దరికి అపరేషన్లు కూడా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లాలో ఆరు పీహెచ్సీల్లో 26 వారా ల్లో సుమారు 15 వేల మందికి వైద్య పరీక్షలు చేశారు. అందులో మహిళలకు వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తున్నాం. దీనిని విస్తృత పరిచేందుకు మరో ఐదు పీహెచ్సీల్లో అమలు చేయాలని నిర్ణయించాం. భవిష్యత్లో అన్ని పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపడతాం.