నల్లగొండ, మార్చి 15 : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్ ల ప్రత్యక్ష వేలంకు రెండో రోజూ కూడా స్పందన లభించింది. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యం లో రెండో రోజు రెసిడెన్షియల్ ప్లాట్ లకు ప్రత్యక్ష వేలం నిర్వహించారు. రెండో రోజు నిర్వహించిన రాజీవ్ స్వగృహ ప్లాట్ ల ప్రత్యక్ష వేలం లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ లలో 28 ఓపెన్ ప్లాట్ లు వేలం పాడి బిడ్డర్ లు తమ సొంతం చేసుకున్నారు.
237 చ.గ. ల విస్తీర్ణం నుంచి 503 చ. గ.ల వరకు గల ప్లాట్ లను రెండో రోజు వేలంలో అత్యధికంగా 8700 రూ.లు, కనిష్ఠంగా 7200 రూ. ల కు చ.గ. చొప్పున వేలం లో సొంతం చేసుకున్నారు. చ.గ. కు ప్రభుత్వం నిర్ణయించిన 7000 రూ.ల కనిష్ఠ ధర తో వేలం ప్రారంభమై చ.గ 100 రూ. లు చొప్పున పెంచుతూ గరిష్ఠంగా వేలం పాడిన బిడ్డర్ ప్లాట్ సొంతం చేసుకున్నారు.
ప్రభుత్వమే లే అవుట్ చేసి డి.టి.సి.పి. నిబంధనల మేరకు డిసెంబర్ 22 లోగా విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు ఇతర సౌకర్యాలు కల్పిస్తుందని, ఎటువంటి చిక్కులు లేని ప్లాట్ లను నిర్భయంగా వేలం ద్వారా తమ సొంతం చేసుకోవచ్చని అన్నారు.
వేలంలో పాల్గొన దలచిన వారు 10,000 రూ.ల డి.డి. చెల్లించి టోకెన్ నంబర్ తీసుకొని వేలం లో పాల్గొనాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో 17 వరకు ప్లాట్ ల ప్రత్యక్ష వేలం నిర్వహిస్తున్నట్లు, ఉదయాదిత్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ లో జిల్లా కలెక్టర్, నల్గొండ పేరున ఏర్పాటు చేసిన కౌంటర్ లో 10 వేల రూ.లు డి.డి.చెల్లించి టోకెన్ నంబర్ పొందవచ్చని తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యక్షంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలం కార్యక్రమం లో టోకెన్ నంబర్ తీసుకొని పాల్గొనే వ్యక్తి తొ పాటు ఒకరిని అతనితో పాటు అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ హెచ్.యం.డి.ఏ. ఈఈ రమేష్, హెచ్.యం. డి.ఏ రెవెన్యూ అధికారి భిక్ష పతి, ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణ కుమార్, గృహనిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.యం.శ్రీనివాసులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరి, పశు సంవర్థక శాఖ ఏ.డి. డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.