రామగిరి, డిసెంబర్ 2 : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా విద్యాశాఖ ప్రోత్సహిస్తూ
వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నది. నేటి నుంచి ఈ నెల 5 వరకు చేపట్టనున్న సైన్స్ఫెయిర్కు నల్లగొండ జిల్లా కేంద్రంలోని డాన్బాస్కో ఉన్నత పాఠశాల వేదికైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. 2021-22 ఇన్స్పైర్ మానక్లో ఎంపికైన ప్రాజెక్టులను కూడా ఇందులో ప్రదర్శించనున్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టే జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సాంకేతికత – బొమ్మలు అనే ప్రధాన అంశంతో నల్లగొండలోని డాన్బాస్కో ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి ఈ నెల 5వరకు నిర్వహించనున్న సైన్స్ఫేర్ ఏర్పాట్లను డీఈఓ బి.భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇందులో అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలతో రానున్నారు.
జిల్లా స్థాయి ‘రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శిని’ పేరుతో సైన్స్ఫేర్ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ‘సాంకేతికత మరియు బొమ్మలు’తో విద్యార్థులు పలు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయి ప్రదర్శనలో ఎంపికైన ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన చైర్మన్గా కలెక్టర్ వ్యహరిస్తుండగా, మెంబర్ కన్వీనర్గా డీఈఓ, సభ్యులుగా డైట్ ప్రిన్సిపాల్, జిల్లా సైన్స్ అధికారి, పలువురితో కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏడు అంశాల్లో జరుగనుండగా.. దానికి తరలివచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వసతులతోపాటు బస చేయడానికి ప్రత్యేక సదుపాయం కల్పించారు. ప్రదర్శన రిజిస్ట్రేషన్ సమయంలోనే అల్పాహారం, భోజన టోకెన్లతోపాటు ఐడీ కార్డులను అందజేస్తారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల నుంచి విద్యార్థులు తరలి రానున్నారు. దాంతో శనివారం డాన్బాస్కో విద్యా సంస్థల ప్రాంగణం సందడిగా మారనుంది.
ప్రారంభోత్సవానికి హాజరు కానున్న మంత్రి
జిల్లా స్థాయి సైన్స్ఫేర్ ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
నేటి నుంచి 5వరకు నిర్వహణఏర్పాట్ల పరిశీలన
జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను డీఈఓ బి.భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, వైజ్ఞానిక ప్రదర్శన వివిధ కమిటీల సభ్యులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టులను ఏర్పాటు చేసే గదులతోపాటు ఆవరణ, ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా గ్యాడ్జిలను నియమించారు. తాగునీరు, భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఆయన వెంట సైన్స్ ఉపాధ్యాయులు ఆర్రూరి జానయ్య, వివిధ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఈ సూచనలు పాటించాలి
అన్ని ఏర్పాట్లు చేశాం
విద్యార్థుల శాస్త్రీయ నైపుణ్యాలకు పదును పెట్టాలనేదే మా సంకల్పం. ఇందుకోసం నేటి నుంచి 5వరకు జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత ప్రదర్శన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్ఎల్బీసీలోని డాన్బాస్కో ఉన్నత పాఠశాలలో ప్రదర్శన జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేసి తీసుకు రావాలి. 7 ఉప అంశాల్లో ఉత్తమమైన అధిక ప్రాజెక్టులు వచ్చేలా, వాటిలో వర్కింగ్ మోడల్స్కు ప్రాధాన్యత ఇచ్చేలా ఉపాధ్యాయులు చూడాలి. వీటితోపాటు ఇన్స్పైర్ మానక్ (2021-22)కు ఎంపికైన 92 ప్రాజెక్టుల ప్రదర్శన సైతం జరుగుతుంది. మన విద్యార్థులు ఆ ప్రాజెక్టులతో రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లి జిల్లా ఖ్యాతి చాటేలా చూడాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ