సూర్యాపేట రూరల్/బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 20 : విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట మండల పరిధి ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు చావే కారణం కాకుడాదని, ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినుల ఆత్మహత్యల ఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ పాఠశాలలో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా, ఉద్యోగం అందేలా తమ కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు.
అనంతరం పాఠశాలలో తరగతి గదులు, భోజనశాలను, మరుగుదొడ్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. వైష్ణవి, ఆస్మిత చిత్ర పటాలకు నివాళులర్పించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. వారి వెంట ఆర్డీఓ సీహెచ్.కృష్ణయ్య ఉన్నారు.