పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆరోగ్యవంతమైన కూరగాయలు అందించాలన్నదే లక్ష్యంగా ఓ యువరైతు సేంద్రియ సాగును ఎంచుకున్నాడు. తనకున్న 7 ఎకరాలతోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని వివిధ రకాల కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన యువ రైతు కాసాని సత్యనారాయణ.
365 రోజులపాటు కష్టపడి పని చేస్తూ పక్కా ప్రణాళికతో తీరొక్క కూరగాయలు పండిస్తున్నాడు సత్యనారాయణ. తాను పండించే పంటలకు చీడపీడలు సోకకుండా సేంద్రియ ఎరువులు వాడుతూ అధిక దిగుబడి పొందుతున్నాడు. చుక్క నీరు వృథా కాకుండా మొక్కలకు సమృద్ధిగా నీరందేలా బిందు సేద్యం, కలుపు మొక్కల నివారణకు మల్చింగ్ పద్ధతి ఎంచుకున్నాడు. మొక్కలకు ఎరువులు డ్రిప్ ద్వారా అందిస్తూ సుమారు 12 రకాల కూరగాయలు పండిస్తున్నాడు. టమాట, సొర, చిక్కుడు, గుమ్మడి, బెండ, కాకర, మూడు రకాల వంకాయలు, దోస, కీరదోస, దొండ సాగు చేసి భువనగిరిలోని రైతు బజారులో కొనుగోలుదార్లకు విక్రయిస్తున్నాడు. ఇతను పండించే కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించడంతో రైతు బజార్లోని కూరగాయల దుకాణాదారులు అధిక మొత్తంలో కొనుగోలు చేసి కొనుగోలుదార్లకు విక్రయిస్తున్నారు. ఇతని వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న నాలుగు కుటుంబాల వారికి సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందిస్తున్నాడు. అన్ని ఖర్చులు పోగా నెలకు సుమారు 60 వేల రూపాయల వరకు మిగులుతున్నట్లు చెబుతున్నాడు.