యాదగిరిగుట్ట, ఏప్రిల్15 : యాదగిరగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవ నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. సుమారు 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.27,65,776 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
లక్ష్మీనరసింహస్వామిని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం యాదగిరికొండకు చేరుకున్న వారు మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.