కొలిచిన వారికి కొంగు బంగారమై, పిలిచిన వారికి చల్లని దైవంగా, అనారోగ్యాలను పారదోలి ఆయురారోగ్యాలు ప్రసాదించే స్వామిగా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధికెక్కాడు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతున్నది. జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్ల పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆలయాన్ని, గోపురాలను, చుట్టు పక్కల ఉన్న శివుడు, గణపతి విగ్రహాలకు రంగులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఇప్పటికే భక్తుల సౌకర్యాల కల్పనపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఘాట్ రోడ్డు వద్ద, గుట్ట కింద రద్దీ ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. మంచి నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. భక్తులకు జాతర విశేషాలను తెలియజేసేందుకు నాలుగు రోజుల క్రితమే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చెర్వుగట్టుపై ఇప్పటికే రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి.
జాతర విశేషాలు
ఈ నెల 28న ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. అదే రోజు రాత్రి (తెల్లవారితే ఆదివారం 29వ తేది) స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 30న (తెల్లవారితే మంగళవారం) అగ్నిగుండాలు, 31న (తెల్లవారితే బుధవారం) దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. ఫిబ్రవరి1 రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు గజవాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహోత్సవాలను పరిపూర్ణం చేస్తారు.
భారీ బందోబస్తు
చెర్వుగట్టు జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుట్ట పైన, కింద రెండు ఔట్పోస్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుట్ట పైకి వృద్ధులు, చిన్న పిల్లలను చేరవేసేందుకు 5 ఆటోలను మాత్రమే అనుమతిస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్లను చూసేందుకు రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు డ్రోన్ కెమెరాలతో గుట్ట పరిసరాలను పర్యవేక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర ఏర్పాట్లపై దృష్టి సాధించాం. స్వామి వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నాం. కల్యాణం తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం.
– నవీన్, ఆలయ ఈఓ
చెర్వుగట్టు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నల్లగొండ సిటీ, జనవరి 24 : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. నార్కట్పల్లి, నల్లగొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ డిపోల నుంచి ప్రత్యేక బస్తులను నడుపనున్నారు. నార్కట్పల్లి, నల్లగొండ డిపోల నుంచి వచ్చే ప్రతి సర్వీసు చెర్వుగట్టు మీదుగా నడుపుతామని నల్లగొండ, నార్కట్పల్లి డిపో మేనేజర్లు డీఎం రాంమోహన్రెడ్డి, వెంకటమ్మ తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకొని నల్లగొండ డిపో నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచనున్నారు.