రామన్నపేట, మే 29 : రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉండడం దౌర్బాగ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో రూ.8.5కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వందేండ్లలో జరగాల్సిన అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. చేసిన అభివృద్ధిని చెప్పడానికి నిర్వహించే దశాబ్ది ఉత్సవాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం విడ్డూరమన్నారు. బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మోదీకి తెలంగాణ అభివృద్ధి చెందడం సంతోషంగా లేదన్నారు. ఫ్లోరోసిస్ పారదోలడానికి మిషన్ భగీరథకు రూ.10కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా నిధులు మంజూరు చేయలేదన్నారు. రాష్ర్టానికి మోదీ ఎప్పుడు వచ్చినా విషం చిమ్మే మాటలు చెప్పారే తప్ప అభివృద్ధికి రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, హైద్రాబాద్ మినహా దేశంలోని ప్రధాన నగరాలు సైతం చీకట్లో మగ్గుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే ఇంకా మెరుగై పథకాలు అమలు చేసే దమ్ము ప్రతిపక్షపార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రతియేటా ఇచ్చే అవార్డుల్లో సగానికి పూపైగా తెలంగాణ కే దక్కుతుండడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శన మన్నారు. సాయంత్రం 6గంటలు దాటితో హైదరాబాద్ మినహా దేశంలోని నగరాలు కరెంట్ కోతలతో చీకట్లే దర్శనమిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే మొగోళ్లు ప్రస్తుత పాలనకు మించి చేస్తామనే దమ్ముందా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే చిరుమర్తిని గెలిపించుకోవాలి; ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి తాపత్రాయ పడే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిల సహకారంతో జిల్లాలో అధిక నిధులు తెస్తున్నారన్నారు. పార్టీ నాయకుల అశీస్సులు చిరుమర్తికే ఉన్నాయని ప్రజలు సైతం ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జిల్లాలో 12 సీట్లు గెలవడంతో పాటు, ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
పార్టీలకు అతీతంగా సహకరించాలి ; ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
పార్టీలకు అతీతంగా చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. పల్లెలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మండల కేంద్రంలో రూ.3.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి వర్గానికి ఆత్మగౌరవం కల్పిస్తున్నదన్నారు. నియోజకవర్గానికి 7,800గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.1.20కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానను 100 పడకల స్థాయికి పెంచడంతోపాటు, నూతన భవనం మంజూరుకు మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు. లోతుకుంట పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ధర్మారెడ్డి కాల్వ అధునీకరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ నర్సింహనాయక్, ఈఈ శంకరయ్య, డీఈ షహనాజ్, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ బొక్క మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కమ్మంపాటి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుత్తా నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్రెడ్డి, ఎంపీటీసీ గొరిగె నర్సి ంహ, మందడి రవీందర్రెడ్డి, బందెల రాములు, పోశబోయిన మల్లేశం, ఎ.రమేశ్, బి.రమేశ్, శ్రీధర్రెడ్డి, సాయి, సంతోష్, నరేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.