నేరేడుగొమ్ము(చందంపేట), జనవరి 30 : వన్య ప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేయడంతో పాటు రూ.10లక్షలతో రోడ్డు మార్గం ఏర్పాటు చేసింది. దాంతో ఉమ్మడి చందంపేట మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు.. విలువైన అటవీ సంపద.. హరితహారం మొక్కల సంరక్షణ దిశగా అటవీ శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ పనులతో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న మారుమూల గ్రామాలు కొత్త శోభ సంతరించుకున్నాయి.
ఫెన్సింగ్, నీటి తొట్టెలు, వాచ్టవర్లు ఏర్పాటు
నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్, చిన్న మునిగల్ గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు 5కిలో మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ – నాగార్జునసాగర్ డివిజన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సైతం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వన్య ప్రాణుల సంరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖాధికారులు పేర్కొంటున్నారు. వేసవిలో వన్య ప్రాణులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో వాచ్ టవర్లు, బీట్ ఆఫీసర్ల విశ్రాంత గదుల ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వన్య ప్రాణుల సంరక్షణకు నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్నారు. ట్రాప్ కెమెరాలతో వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వన్య ప్రాణులు సంరక్షణ.. కలప అక్రమ రవాణా అడ్డుకునే దిశగా
హరితహారంలో భాగంగా అటవీ ప్రాంత ంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మొక్కలు నాటారు. సుమారు 3వేల రకాల మొక్కలు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ కలప తరలింపును అడ్డుకోవడంతో పాటు వన్య ప్రాణుల సంరక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాప్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటుతో వన్య ప్రాణుల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అటవీ అభివృద్ధి పనులు చేపట్టాం
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అభివృద్ధి పనులు చేపట్టాం. ఉమ్మడి చందంపేట మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులతో ఈ ప్రాంతం సరికొత్తగా కనువిందు చేస్తున్నది. ఫెన్సింగ్, నీటి తొట్టిలు, చెక్ డ్యాం, వాచ్ టవర్లు, ట్రాప్ కెమెరాలు, బీట్ ఆఫీసర్ల విశ్రాంతి గదులు ఇలా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
– సాయిప్రకాశ్, ఎఫ్ఆర్ఓ