అద్దంకి దయాకర్పై ఆర్డీఆర్ వర్గీయుల దాడి
ఓ వివాహ వేడుకకు వచ్చి వెళ్తుండగా ఘటన
తుంగతుర్తి, మే 22 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ మధ్య కొంతకాలంగా ఉన్న వైరం ఇటీవల తారాస్థాయికి చేరింది. ఇరువురూ ఒకరిపై మరొకరు ఏఐసీసీకి ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో వివాదం సద్దుమణుగకపోగా.. దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
ఆదివారం మధ్యాహ్నం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడి వివాహానికి అద్దంకి దయాకర్ కుటుంబసమేతంగా వచ్చి వెళ్తుండగా.. రాంరెడ్డి దామోదర్రెడ్డి వర్గీయులు దాడి చేశారు. తమ నాయకుడు ఆర్డీఆర్పై ఏఐసీసీకి ఫిర్యాదు చేసి తమ నియోజకవర్గానికి ఎందుకు వచ్చావంటూ అద్దంకిపై దాడి చేయగా.. ఆయన భార్య తీవ్రంగా ప్రతిఘటించింది. అడ్డొచ్చిన డ్రైవర్పైనా దాడి చేశారు. దీంతో కొందరు స్థానికులు అద్దంకి దయాకర్ను ఒక కారులో, ఆయన కుటుంబసభ్యులను మరో కారులో పం పించారు. ఈ విషయంపై అద్దంకి దయాకర్ను ఫోన్లో అడుగగా.. వివాహానికి హాజరైన తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దాడులు చేసుకోవడం కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నదని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.