సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ) :గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, వెంకట్రెడ్డితో కలిసి జిల్లా యంత్రాంగంతో వెబ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెండ్రోజుల్లో 40 సెంటీమీటర్లతో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన శిథిల భవనాలు, పాఠశాలల వద్దకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. రహదారులపై ఉన్న లోలెవెల్ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంటున్నదని, అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను డ్యూటీలో ఉంచాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మట్టి ఇండ్లల్లో ఉండే వారిని గుర్తించి పక్కా భవనాల్లోకి తరలించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రజలు రెండ్రోజులపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. విద్యుత్ విషయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా చెరువులకు నీరు వచ్చి చేరుతున్నందున నిండిన చెరువుల్లోని నీటిని వెంటనే కిందికి వదలాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ, వాటి అనుబంధ విభాగాలు వర్షాలు ఆగిపోయే వరకు సమన్వయంతో పని చేయాలన్నారు. వాగులు, వంకలు, లోవెల్ బ్రిడ్జిల వద్ద ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి నుంచి కేశవ పురం వెళ్లే మార్గంలో, సంఘం నుంచి కోడూరు వెళ్లే రోడ్డు, జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మల నుంచి కోడూరు, మోతె మండలం నరసింహాపురం నుంచి నాయకన్గూడెం వరకు, నడిగూడెం మండలం తెల్లబల్లి నుంచి త్రిపురారం, చివ్వెంల మండలం ముకుందాపురం నుంచి నసీంపేట, ఆత్మకూర్(ఎస్) మండలం వరకు వరద ఉధృతి ఉంటుందని ఆయా ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. జిల్లా, మండల అధికారులు, పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.