నల్లగొండ, జనవరి 2: వాహనాల డ్రైవర్లు ఏదైనా ప్రమాదానికి కారణమై పారిపోతే (హిట్ అండ్ రన్ కేసులో) ఏడు లక్షల రూపాయల జరిమానాతోపాటు పదేండ్ల జైలు శిక్ష విధిస్తామని కేంద్రం చట్టం చేసింది. దానిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ యజమానులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోనూ మంగళవారం నిరసనలు జరిగాయి. దాంతో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులుదీరారు. ఖాళీ బాటిళ్లు, డబ్బాల్లో పెట్రోల్ను నింపుకొన్నారు. నిల్వలు అయిపోవడంతో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉన్న బంకులు మూడు రోజుల పాటు సమ్మె చేస్తామని ప్రకటించటంతో బంకులకు వాహనాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత సమ్మె చేయడం లేదని ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ ప్రకటించినప్పటికీ రద్దీ తగ్గలేదు.