యాదగిరి గుట్ట, ఫిబ్రవరి 22 : పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, వేద పండితులు, అర్చకులు, పారాయణికుల వేదఘోష, భక్తుల జేజేల నడుమ సంబురంగా చేపట్టారు. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తాన నారసింహ స్వామి అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేదపండితులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. పండితుల వేదఘోష, భక్తజనం మధ్య గురువారం రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణ వేడుక రాత్రి వరకు కొనసాగింది. కల్యాణోత్సవానికి చూడడానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. అంతకు ముందు ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధనతోపాటు స్వస్తి, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహ మూర్తి, ఈఓ రామకృష్ణారావు కంకణ ధారణ చేశారు. హనుమంత వాహన సేవ నిర్వహించారు. స్వామివారికి బంగారు యజ్ఞోప వీతధారణ చేశారు. స్వామి, అమ్మవార్లకు మధ్య తెరపత్రం ఉంచి జీలకర్ర బెల్లం ఘటాన్ని చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూల మాలల దండలను మార్పిడి చేశారు. ప్రవచనలు చెప్పి, నూతన వధూవరులకు కన్యాదానం చేశారు. వేద పాఠశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ దరూరి రామానుజాచార్యులు కల్యాణ వ్యాఖ్యానం గావించారు.
తిరుకల్యాణ మహోత్సవం తిలకించిన భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్కంధ పురాణంలో స్పష్టం చేసిన విషయాన్ని కల్యాణోత్సవ వ్యాఖ్యాత దరూరి రామానుజాచార్యులు వివరించారు. సమస్త ప్రాణ కోటికి, ప్రకృతి మండలానికి లక్ష్మీనరసింహుడి అనుగ్రహం, సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని వేదాలు, ఇతిహాసాలలో పేర్కొనబడి ఉందని ఆయన తెలిపారు. కల్యాణానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పట్టు వస్ర్తాలు తీసుకొచ్చారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డితో పాటు ఆలయ అనువంశిక ధర్మకర్త డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞికులు కిరణ్కుమారాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణధారులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, వేణగోపాలాచార్యులు, ఆలయ అధికారులు శ్రీకాంత్, విజయ్ పాల్గొన్నారు.
కల్యాణ మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆలరించాయి. యాదగిరిగుట్టకు చెందిన శ్రీకుసుమ హరనాథ భజన మండలి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మహిళా భజన మండలి భజన కార్యక్రమం, జీవీఆర్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ వారి భక్తి సంగీతం, శ్రీ జగిని హరీశ్ బృందం వారి నృత్య ప్రదర్శనలు అలరించాయి.