సూర్యాపేట టౌన్, మే 21 : కామ్రేడ్ జలగం జనార్ధన్ (జున్ను) స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తెలిపారు. జున్ను నాల్గొవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డు చంద్ర పుల్లారెడ్డి నగర్లో ఆయన విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. కామ్రేడ్ జున్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎంఎల్), సీపీఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు.
దేశంలో ప్రధాని మోదీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురిచేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ రాజ్య హింసను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను, వారితో పాటు అమాయక గిరిజనులను పిట్టల్లా కాల్చి చంపుతున్నారన్నారు. శాంతి చర్చలు చేద్దామని మేధావులు, అన్ని రాజకీయ వర్గాలు ముందుకు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే నేడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావుతో పాటు 27 మందిని నక్సల్స్ పేరుతో దారుణంగా కాల్చి చంపారన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఆపి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, గొడ్డలి నరసన్న, వాసా పల్లయ్య, పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, ఉపాధ్యక్షురాలు సంతోషి, జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, వీరబాబు, కట్టా రమేశ్, గొడ్డలి లింగన్న పాల్గొన్నారు.