‘ఆమె పేరు రవళి. వయస్సు 38. కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఆమె ఓసీడీతో బాధపడుతుంది. కుటుంబ విషయాలన్నీ బయటి వారికి తెలుస్తున్నాయని ఆందోళన చెందేది. ప్రతిదీ అనుమానమే. అయితే ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందంటే వారి ఇంట్లో ఉన్న కదలికలు బయటి వారు చూస్తున్నారని.. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారని ఊహించుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె రోజూ రాత్రిపూట చీకట్లో స్నానం చేసేది. చీకట్లో ఎందుకు అని భర్త అడిగితే మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయంటూ సమాధానం.’ ఈ పరిస్థితిలో భర్త ఆమెతో కలిసి మానసిక నిపుణులను ఆశ్రయించాడు.
‘నేను చెడిపోయాను. నాకు అన్నీ పాడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుళ్లపై కూడా నేను పాడు ఆలోచనలు చేస్తున్నా. నేను బతకడానికి వీల్లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.’ అని సూసైడ్ లెటర్ రాసి బిల్డింగ్ మీది నుంచి దూకడానికి ప్రయత్నించిన అరుణ అనే వివాహితను ఆమె అన్నయ్య రక్షించి సైకాలజిస్టును సంప్రదించాడు.
ఆ విద్యార్థి పేరు ప్రకాశ్. బీటెక్ పూర్తి చేశాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె నిరాకరించిందని ఉన్నత చదువులు మానేసి, ఉద్యోగం చేయక ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు. పేరెంట్స్ ఎంత చెప్పినా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అతడిని సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లగా కౌన్సెలింగ్లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ అమ్మాయి కోసం నేను తనలా మారిపోయానని, కానీ.. ఆ యువతి మోసం చేసిందని చెప్పాడు. దీంతో ఏం చేయలేక చాలా సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని వివరించాడు.’ ఇలాంటి సంఘటలు అనేకం.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మానసిక నిపుణులను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారి తీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పారు. యూ అండ్ మీ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మంది మానసిక సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతున్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం బాగుంటే అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి తగ్గుతుందని వివరించారు. రాష్ట్ర స్థాయిలో మెంటల్ హెల్త్ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మెంటల్ హెల్త్పై నగరంలో పలు ప్రాంతాలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూ మానసిక సమస్యలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను నమస్తే తెలంగాణ పలుకరించగా.. చెప్పిన విషయాలివి.
కౌన్సెలింగ్ పని చేస్తుందా?
మాత్రలేమీ ఉండవు. మాటలతోనే బాధితుడి ఆలోచనలను మార్చడం (రీస్ట్రక్చర్ ఆఫ్ థాట్స్). సమస్యకు పరిష్కారం చూపెట్టే మార్గాలను తెలియజేయడం. మానసిక సమస్య మొదలైనప్పుడు ఆ ప్రభావం మన ఆలోచనలపై పడుతుంది. మనిషి అంటే ఎవరు? ఆలోచననే. మనం ఎలా ఆలోచిస్తున్నామో అలా అనుభూతి చెందుతాం. ఎలా అనుభూతి చెందుతున్నామో అలా ప్రవర్తిస్తాం. ఇదే ఆ వ్యక్తి జీవనయానం. కనుక ఆలోచన అనేది ఇక్కడ ముఖ్యం. ఆ ఆలోచనలకు కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. చాలా మంది సూసైడ్ ప్రయత్నం చేస్తుంటారు. ఇదేదో క్షణికావేశం అని చాలా మంది అనుకుంటారు. కానీ.. వాస్తవానికి అది క్షణికావేశం కాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడిని చాలా రోజులుగా వేధిస్తుంటాయి. బతికి ఇక లాభం లేదనే స్థితికి వెళ్లిపోతారు. ఇలాంటి వారి లక్షణాలు మొదట మనం మాట్లాడుకున్నట్టు ఆ నాలుగు ప్రధాన మానసిక సమస్యల నుంచే మొదలవుతాయి. అందుకే మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఏ లక్షణాలు ఉంటే కౌన్సెలింగ్ అవసరం?
ఎవరికి వారు తమ మానసిక స్థితిని చెక్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో తెలుసుకోవాలి. నిద్దుర సక్రమంగా ఉందా? ఉత్సాహంగా ఉంటున్నారా? స్నేహితులు, బంధువులు, సమాజంతో మన కనెక్టివిటీ ఎలా ఉంది? మనం చేసే పనిలో నిమగ్నమవుతున్నామా? ఇలాంటి ప్రశ్నలకు నెగెటివ్ జవాబులు ఉంటే కచ్చితంగా మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టే లెక్క. కొన్ని సందర్భాల్లో మీరు ఈ విషయాల గురించి ఆలోచించలేకపోతారు. కానీ.. మీ ప్రవర్తనలో వస్తున్న మార్పులను పక్కవారు గుర్తించి నీవు ఇంతకు ముందులా కాకుండా భిన్నంగా ఉంటున్నావంటూ చెబుతుంటారు. మీ కోసం, అసహనం ప్రస్తావిస్తుంటారు. అటువంటి సందర్భాలను సీరియస్గా తీసుకుని మానసిక నిపుణుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
నాలుగు ప్రధాన సమస్యలతో..
నగరవాసులు నాలుగు ప్రధానమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అవి ఓసీడీ, ఒత్తిడి, ఆందోళన, సైకోసిస్. ఈ కారణాలతో వారు జబ్బులకు గురవుతున్నారు. 70 శాతం రోగాల వెనుక మానసిక సమస్యలే కారణం. కానీ.. ఈ విషయంపై అవగాహన లేక చాలా మంది మానసిక సమస్యలు ముదిరే వరకు నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా వారు ఇతర అనారోగ్యాలకు గురవుతుంటారు. ఈ క్రమంలో వారు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. ముఖ్యంగా దంపతుల్లో చాలా మంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు.
ఈ లక్షణాలు చాలా ప్రమాదం..!
ఓసీడీ (ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్). ఇదొక అనుమాన జబ్బు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. కడిగిన పాత్రలనే మళ్లీ మళ్లీ కడుగుతుంటారు. ఒకే ఆలోచనను పట్టుకుని వేలాడుతుంటారు. రెండోది ఒత్తిడి. ఇది చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి వారినీ ఏ పనీ చేయకుండా వెనక్కి లాగుతుంటుంది. మూడోది ఆందోళన. కుదురుగా ఉండనివ్వదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎటువంటి వార్త వింటామోననే భయం వెంటాడుతుంటుంది. చివరిది సైకోసిస్. ఇది విచిత్రమైనది. ఏమీ లేకున్నా ఏదో కనిపిస్తుందనే భ్రమ పడుతుంటారు. పక్కవారు ఏం మాట్లాడుకున్నా తన గురించే మాట్లాడుతున్నారనే నిర్ణయానికి వచ్చేస్తారు. అనుమానంతో రగిలిపోతుంటారు. చాలా వరకు కాపురాలు సైకోసిస్ సమస్యలతో కూలిపోయాయి.
పేరెంట్స్ మేల్కోకపోతే వినాశకరం
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పేరెంట్స్దే. వారి భవిష్యత్తును అందంగా తీర్చిదద్దగలిగేది వారే. మొదటి ఆరేండ్లు పిల్లలతో సక్రమంగా లేకపోతే అది చాలా వ్యతిరేక పరిస్థితులకు దారితీస్తాయి. చిన్నారుల మానసిక ఎదుగుదలలో పేరెంట్స్దే కీలక పాత్ర. తల్లిదండ్రులు పిల్లల ముందే ఘర్షణలు, పోట్లాడుకోవడం చేయకూడదు. పోట్లాడుకుని, అక్రమ సంబంధంతోనో భర్తను వదిలేసి వెళ్లినా.. భార్యను వదిలేసి భర్త వెళ్లినా.. ఆ ప్రభావం చిన్నారులపై ఉంటుంది. వారు మానసికంగా కుమిలిపోతారు. ఫలితంగా వారి ఎదుగుదల అంతా వ్యతిరేకంగా (యాంటీ సొసైటీ పర్సనాలిటీ డిసార్డర్) సాగుతుంది. క్రిమినల్స్ అందరూ ఇంట్లోనే తయారు చేయబడుతారనే విషయం గుర్తుంచుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లలను ఎలా పెంచాలో అవగాహనతో ఉండాలి.
యూ అండ్ మీ గురించి?
యూ అండ్ మీ సంస్థ 2006లో ప్రారంభించాం. బాగ్లింగంపల్లిలో ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు 20వేల మందికి పరిష్కారాలు చూపెట్టాం. 15వేల మంది విద్యార్థులకు మానసిక సమస్యలపై అవగాహన కల్పించాం. 25వేల మందికి మెంటల్ హెల్త్ మెటీరియల్స్ ఉచితంగా పంపిణీ చేశాం. విదేశాల నుంచి కూడా ఆన్లైన్లో కౌన్సెలింగ్ తీసుకుంటారు. తైవాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, వియత్నాం, ఫిలిప్పిన్స్, బ్యాంకాక్ దేశాల్లోనూ కౌన్సెలింగ్ సెషన్స్ ఏర్పాటు చేశాం. అక్కడి వారు ఎక్కువగా ఓసీడీ, డిప్రెషన్తో బాధపడుతుంటారు. నగరంలో ఇప్పుడు ఎగ్జిబిషన్లలో మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 30న దుర్గం చెరువు పార్క్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం.
పిచ్చి అనుకుంటారేమోననే భయం?
చాలా మంది మెంటల్ హెల్త్ సమస్యలు అనగానే పిచ్చి అని అనుకుంటారేమోనని అపోహ చెందుతారు. అది సరైనది కాదు. మానసిక సమస్యలు అనేక స్టేజీల వారీగా ఉంటాయి. అన్ని స్టేజీలను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు అంతిమంగా పిచ్చి దశకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక ప్రతి మానసిక సమస్య పిచ్చి అనుకుని మానసిక నిపుణులను కలువడం లేదు. అలా చేయకుండా మనస్సు బాగుండటం లేదు అనుకున్నప్పుడు నిపుణులను కలువడం మంచిది.