దేశ ప్రథమ పౌరురాలు ముర్ము శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. కూతురు ఇతిశ్రీ ముర్ముతో కలిసి గర్భాలయంలో స్వామివారికి సువర్ణపుష్పార్చన జరిపించారు.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్లోని బొల్లారం నుంచి హెలికాప్టర్లో ఉదయం 9.30గంటలకు యాదగిరిగుట్టకు చేరుకోగా, మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి,
సత్యవతీరాథోడ్. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్తో రాష్ట్రపతి కొండపైకి చేరుకున్నారు. ఉత్తర రాజగోపురం వద్ద ఆలయ ప్రధానార్చకులు, అధికారులు భాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛరణతో పూర్ణకుంభం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం ప్రధానాలయం ముఖ మండపం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం ఇచ్చింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్వామివారి చిత్రపటాన్ని, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి మహాపప్రసాదాన్ని, ఈవో ఎన్.గీత స్వామివారి శేషవస్ర్తాలను అందజేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన ఆలయ పునర్నిర్మాణ పనుల ఫొటో ఎగ్జిబిషన్ రాష్ట్రపతి ముర్ము తిలకించారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్రపతి కితాబునిచ్చినట్టు ఆలయ ఈవో ఎన్.గీత వెల్లడించారు.
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు
యాదాద్రి, డిసెంబర్30 : యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. ఉదయం హైదరాబాద్లోని బొల్లారం ఈఎంఈ హెలిప్యాడ్ నుంచి ఐఏఎఫ్ ఎంఐ 17 హెలికాప్టర్ ద్వారా యాదాద్రి కొండ కింద పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్ ద్వారా ఘాట్ రోడ్డు గుండా ప్రొటోకాల్ కార్యాలయం ముందు నిర్మించిన సీసీ రోడ్డు మీదుగా ఆలయ మాఢవీధుల్లోకి వెళ్లారు. అక్కడే ఈఓ ఎన్. గీత రాష్ట్రపతికి పూల దండ వేయగా, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్వామివారి శెల్లాను మెడలో వేశారు.
ఉప ప్రధానార్చకులు, వేద పండితులు ఆమెకు స్వస్తి స్వాగతం తెలిపారు. సన్నాయి మేళాలు, భాజాభంజత్రీల నడుమ రాష్ట్రపతిని ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చారు. ఉత్తర ద్వారం వద్ద ప్రధానార్చకుల బృందం పూర్ణకుంభ స్వాగతం పలికింది. అక్కడి తూర్పు త్రితల రాజగోపురం గుండా ఆలయంలోకి వెళ్లిన రాష్ట్రపతి ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం వద్ద హారతిని స్వీకరించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ధ్వజస్తంభానికి మొక్కారు. అక్కడి నుంచి నేరుగా స్వామివారి గర్భాలయంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పశ్చిమ రాజగోపురం వద్ద గిరిజన సంప్రదాయ రీతిలో యాదగిరి నరసింహస్వామికి నమస్కరించారు.
5 నిమిషాలపాటు ఫొటో గ్యాలరీ వీక్షణ
స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న రాష్ట్రపతి పశ్చిమ ద్వారం గుండా వచ్చి అద్దాల మండపాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. గత ప్రధానాలయం, బాలాలయం, ఆలయాన్ని సందర్శించిన వీవీఐపీల చిత్రాలు, కృష్ణ శిలల నిర్మాణ శైలి, ఆలయ పునర్నిర్మాణ పనుల తీరుతెన్నులు, టెంపుల్ సిటీ ముఖ చిత్రం, స్వర్ణవర్ణపు లైటింగ్లో ప్రధానాలయం వంటి చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణాలపై రాష్ట్రపతికి ఈఓ ఎన్.గీత వివరించారు. సుమారు 5 నిమిషాల పాటు ప్రశాంతంగా పరిశీలించి అనందం వ్యక్తం చేశారు. అద్దాల మండపం ప్రాంగణంలో కొద్దిసేపు ఆశీసునురాలైన రాష్ట్రపతికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కట్టె పొంగళి, పులిహోర, లడ్డూ, కేసరి బాత్, సిరాను అందించారు.
6 నిమిషాలపాటు గర్భాలయంలో..
స్వయంభూ పంచ నారసింహుడి గర్భాలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు మూడు నిమిషాల పాటు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రధానార్చక బృందం స్వామివారి ఆశీర్వచనం చేసింది.. స్వామివారి గర్భాలయంలో రాష్ట్రపతి 6 నిమిషాలపాటు గడిపారు.
స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసిన మంత్రి
ప్రధానాలయ ముఖ మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్ ఇత్తడితో ప్రత్యేకంగా తయారు చేసిన స్వామి, అమ్మవార్ల చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం అలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి ప్రత్యేకంగా తయారు చేసిన స్వామివారి మహాప్రసాదాన్ని, ఆలయ ఈఓ ఎన్. గీత శేష వస్ర్తాలను అందజేశారు.
4 నిమిషాలు చతుర్వేద ఆశీర్వచనం
స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై ఆశీసునులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు, ప్రబంధ పారాయణదారులు రాష్ట్రపతికి చతుర్వేద మహా ఆశీర్వచనం చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదాలను ఒక్కో వేదం ఒక నిమిషం పాటు పఠిస్తూ నాలుగు నిమిషాలపాటు వేద ఆశీర్వచనం చేశారు.
మంత్రులు, ఆలయ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక ఫొటో
యాదాద్రి ఆలయ చరిత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలిచిపోయే విధంగా ప్రత్యేకమైన ఫొటో దిగారు. ప్రధానాలయ మాఢవీధుల్లోకి ఈశాన్య అష్టభుజి ప్రాకార మండపం వద్ద రాష్ట్రపతి కూతురు ఇతిశ్రీ ముర్ము, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్, ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందితో కలిసి ఫొటో దిగారు.
ప్రశాంతంగా రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి పర్యటన ప్రశాంతంగా ముగిసింది. పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించారు. ఒక్కరోజు ముందే యాదాద్రి ఆలయంతోపాటు, గండిచెరువు, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదగిరిగుట్ట పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రోడ్డు ప్రయాణం కావడంతో రోడ్లపై ఎలాంటి ఆటంకం కలుగుకుండా పటిష్ట భద్రతను నిర్వహించారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలతో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అధికారులు బందోబస్తు చేపట్టారు. సుమారు 55 గంటలపాటు సాగిన పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆలయ పునర్నిర్మాణంపై రాష్ట్రపతి సంతృప్తి : ఆలయ ఈఓ గీత
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చాలా బాగున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కితాబునిచ్చినట్టు ఆలయ ఈఓ ఎన్. గీత వెల్లడించారు. దర్శనం అనంతరం యాదాద్రి ఆలయం అద్దా మండపం వద్ద పునర్నిర్మాణ పనుల ఫొటో గ్యాలరీని పరిశీలించారని, ఆలయ నిర్మాణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణంలో తీసుకున్న జాగ్రతలు, ఆలయ విస్తీర్ణం, శిల్పకళా నైపుణ్యం, నాణ్యతా ప్రమాణాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు, గతంలో ఆలయం విస్తీర్ణం, ప్రస్తుతం పెంచిన ఆలయ విస్తీర్ణం, పూర్తిగా ప్రభుత్వ ఖజానాతోనే ఆలయాన్ని నిర్మించామని రాష్ట్రపతికి వివరించినట్లు ఈఓ చెప్పారు.