యాదాద్రి, డిసెంబర్ 5 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి రానున్న ద్రౌపదీ ముర్ము యాదగిరీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 15 మంది రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ద్రౌపదీ ముర్ము రాకతో స్వామివారిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు.
గతేడాది జూన్ 15న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఏడాదిన్నర తర్వాత దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సేవలో తరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని రూ.1,100 కోట్ల ప్రభుత్వ ఖజానాతో దేశమే గర్వపడే విధంగా పూర్తి కృష్ణశిలలతో పునర్నిర్మించారు. దాంతో దేశ, విదేశాల నుంచి వీఐపీ, వీవీఐపీల తాకిడి పెరుగుతూ వస్తున్నది. చాలా మంది భక్తులు స్వామివారి ఆలయ నిర్మాణాలను సందర్శించేందుకు వస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తున్నారన్న వార్తలో ప్రాధాన్యత సంతరించుకున్నది.
గతంలో నలుగురు రాష్ట్రపతులు..
దేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమచారంతో గతంలో యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులపై చర్చ సాగుతుంది. లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రాష్ట్రపతుల్లో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రపసాద్, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాల్ శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తాజాగా 15వ రాష్ట్రపతి హోదాలో యాదాద్రికి విచ్చేసిన 5వ దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము నిలువనున్నారు.