కోదాడ, ఆగస్టు 31 : విద్యారంగానికి కొల్లు ప్రమీల వెంకట్రావ్ సేవలు ప్రశంసనీయం అని ఎంఈఓ వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం నడిగూడెం మండలం రత్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, విద్యారంగంలో సుమారు నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయురాలు కొల్లు ప్రమీల వెంకట్రావు ఉద్యోగ విరమణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.శారద అధ్యక్షతన జరిగింది. ఈ అభినందన సభలో ఆయన ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమీల విద్యాబోధన తో పాటు పాఠశాల లో మౌళిక వసతుల కల్పన కు, పేద విద్యార్థులకు అందించిన సహాయాన్ని ఆయన అభిందించారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సేవా భావంతో నిర్వహించిన ప్రమీల వెంకట్రావు సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు.
ప్రధానోపాధ్యాయురాలు జి.శారద మాట్లాడుతూ.. ప్రమీల వెంకట్రావుతో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో విలువైనదని, ఆమె క్రమశిక్షణ, సేవా దృక్పథం, విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమన్నారు. కోదాడ మండలంలో ఆమె పని చేసిన ప్రతి పాఠశాలలో అంకితభావంతో పని చేస్తూ వందలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దరని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆమె ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాట్ల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఈదమ్మ, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి.పద్మావతి, సీఆర్పీ రామారావు, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటాచారి, మాజీ సర్పంచ్ పసుపులేటి బాబు, మండల వార్డు సభ్యుల అధ్యక్షుడు మిరియాల శ్రీను, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమీల వెంకట్రావును శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు.