రామగిరి, ఆగస్టు 27 : చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి సూచించారు. ప్రముఖ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించి జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. యువత ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని, యూనివర్సిటీ ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి, స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్.మురళి, డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, స్పోర్ట్స్ బోర్డ్ జూనియర్ అసిస్టెంట్ ఆర్.హరికిషన్ రావు, విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
జిల్లా కేంద్రంలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో సహితం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పలు అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర కర్ష వాణి, అధ్యాపకులు అపర్ణ, సుల్తానా, సుష్మిత, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు విద్యార్థులు వాలంటీర్లు పాల్గొన్నారు.

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం : ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి