బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 15 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలకు ఎంతమంది రోగులు వచ్చినా వైద్యం చేస్తున్న వైద్యులను అభినందించాలన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాలకు సూపర్ స్పెషాలిటీ పోస్టులు వచ్చాయని, నాలుగైదు డిపార్ట్మెంట్లలో పీజీ పోస్టులు కూడా రావడంతో ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులకు గురికావద్దని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని, రైతులకు అందిస్తున్న రైతుబంధు, రైతుబీమ ప్రపంచ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రజాప్రతినిధులంతా కలిసి విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం జరిగే ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. అనంతరం సూర్యాపేట జడ్పీటీసీ దేశంలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి బీర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరగా, జడ్పీ చైర్పర్సన్ దీపిక ఏకగ్రీవంగా తీర్మానం చేయగా సభ ఆమోదించింది. సమావేవంలో మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ, నీటి పారుదలశాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఇంజినీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గురుకుల విద్యా సంస్థలు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జడ్పీ సీఈఓ సురేశ్కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.