హుజూర్నగర్, సెప్టెంబర్ 12 : దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అదనపు జిల్లా కోర్టును ఆయన వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకే కోర్టుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. జిల్లాకు కోర్టు ప్రారంభమైనందున ఈ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం లభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ కోర్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి నూతన కోర్టును ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. న్యాయవాదులు చట్టాలపైన మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు మెరుగైన న్యాయ సేవలను అందించడానికి అదనపు కోర్టు ఎంతోగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. హుజూర్నగర్కు అదనపు కోర్టు మంజూరుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి చేసిన విశేష కృషిని కొనియాడారు.
జాతీయ లోక్ అదాలత్లో 18 వేల కేసులను పరిష్కరించి సూర్యాపేట జిల్లా 7వ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలోని కోదాడలో నాలుగు కోర్టుల భవన నిర్మాణానికి, తుంగతుర్తిలో నూతన కోర్టు నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి కోర్టు ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ డీఎస్పీ మేక శ్రీనివాస్రావు, డీఎస్పీ ప్రకాశ్, సీఐ రామలింగారెడ్డి, ఏడు మండలాల ఎస్ఐలు, న్యాయవాదులు నారపరాజు శ్రీనివాస్రావు, కాల్వ శ్రీనివాస్రావు, వేణు, చింతలపూడి సుధాకర్, గోపాల కృష్ణమూర్తి, శ్రీనివాస్రెడ్డి, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు.