రామగిరి, మే 22 : సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు పెన్నా అనంతరామ శర్మ అని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్ లేదని కొందరు వాదిస్తున్నారని, కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ లేదన్నారు. అనంత రామ శర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని తెలిపారు. నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తి శర్మ అని కొనియాడారు.
పార్టీలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర కమిటీ సభ్యుడి వరకు పనిచేశారన్నారు. కార్మిక ఉద్యమంలో, అనేక యూనియన్లను నిర్మాణం చేయడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత ప్రకటనలపై నేటి యువత ఆయన చూపిన అడుగుజాడల్లో పనిచేయాలని సూచించారు. వారి ఆశయాలు ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పుచ్చకాయలు నర్సిరెడ్డి, గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య, బి పరిపూర్ణాచారి, నలుపు రాజు సైదులు, మన్నెం బిక్షం, రవీందర్, బొల్లు రవీంద్ర కుమార్, పోలే సత్యనారాయణ పాల్గొన్నారు.