సూర్యాపేట, జనవరి 13 : రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పెద్దగట్టు జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5నుంచి 9వరకు జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. జాతరలో ఎక్కడా సమస్యలు ఉత్పన్నం గాకుండా అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. నిర్దేశించిన సమయానికి జాతర వద్ద అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరలో ట్రాఫిక్ జామ్ గాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు రూట్ మ్యాప్ ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలో యూటర్న్ ద్వారా బస్సులు వచ్చి వెళ్లేలా ఉండాలని చెప్పారు. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని తాగునీటికి ఎలాంటి సమస్యలూ రాకుండా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, నిరంతర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జాతర వద్ద సౌండ్ ప్రూఫ్ జనరేటర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. గుట్టపై క్షౌరశాల పక్కనే సాన్నాల కోసం ప్రత్యేక షవర్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్త్రీలకు ప్రత్యేక సాన్నాల గదులు వాటి వద్ద నీరు నిరంతరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గుట్ట చుట్టూ ఉన్న రైతుల నుంచి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని వారికి వెంటనే పంట నష్టం పరిహారం చెల్లించి చదును చేయించాలన్నారు. ఎక్కడా ప్రొటోకాల్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రతి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించేలా చూడాలన్నారు. పెద్దగట్టు పక్కనే ఉన్న చెరువులో నీరు అధికంగా ఉందని అక్కడికి ప్రజలు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులుయాదవ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చివ్వెంల : దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ పరిసరాలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతర అభివృద్ధి పనులు వేగం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు పనులను అన్నిశాఖల అధికారులు నిత్యం సందర్శించాలని ఆదేశించారు.