వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యవసాయ రంగం, దాని అవసరాలు, కరెంట్, భూగర్భజలాలు, పంపు మోటర్లు, వాటి వాడకం ఇలా ఎందులోనూ కనీసం అవగాహన లేదన్నట్లుగా రేవంత్రెడ్డి పూటకో తీరుగా మాట్లాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో కొత్త పల్లవి అందుకున్నారు. ప్రస్తుత వ్వవసాయ రంగంలో సాధ్యమే కాని 10హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లు వాడితే మూడు గంటలు చాలదా అని మరో ట్విస్టును ముందుకు తెచ్చారు.
వ్యవసాయంలో ఎంత సామర్థ్యం ఉన్న మోటర్లు వినియోగిస్తారు? స్థానికంగా అందుబాటులో ఉన్న భూగర్భజలాలను బట్టి ఆ నీటిని తోడేందుకు ఎంత సామర్థ్యం గల మోటర్లు వాడాలి? ఇలాంటి విషయాలు అవగాహన లేకుండా రేవంత్రెడ్డి తన డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్తో గాడిలో పడిన వ్యవసాయాన్ని ఆగం చేసేందుకు ఇప్పటి నుంచే రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని రైతులు అనుమానిస్తున్నారు. మూడు గంటల కరెంట్ ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్ల భారం ఎలా భరిస్తారని నిలదీస్తున్నారు. ఉన్న మోటర్లను పక్కనేసి 10హెచ్పీ మోటర్లు వాడాలంటే కనీసం ఒక్కో మోటరుపై ఒక్కో రైతు లక్ష రూపాయల అదనపు భారం మోయాల్సిందే. ఇలా చూస్తే జిల్లాలోనే రైతాంగంపై రూ.2,240 కోట్లకుపైగా భారం పడనుంది. ఇవన్నీ ఏమీ ఆలోచించని రేవంత్రెడ్డి ఉచిత కరెంట్పై అడ్డుగోలుగా మాట్లాడడం తగదని రైతులు హెచ్చరిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో తన మనసులోని మాటను బయటపెట్టారు. స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగం పచ్చగా ఉండడాన్ని ఓర్చుకోలేక రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగేలా ఆయన మాటలు అర్థం అవుతున్నాయి. కర్ణాటకలో 5గంటలే ఇస్తున్నామని, అది కూడా అవసరం లేదని, మూడు గంటలే చాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడమే అందుకు నిదర్శనం. ఈ మూడు గంటలతో ఎలా వ్యవసాయం చెయ్యాలో కూడా సెలవిస్తే బాగుటుందని రైతులు కోరుతున్నారు. అయితే.. 24గంటల సమయంలో మూడు గంటలు ఎప్పుడిస్తరనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉదయం ఇస్తరా.. రాత్రి వేళల్లో ఇస్తరా.. ఉదయం గంటన్నర..? రాత్రి వేళ గంటన్నర ఇస్తరా? ఇలా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పగట పూట బంద్ చేసి రాత్రి వేళల్లో ఇస్తే రైతుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇదే పరిస్థితి తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనుభవించారు. అప్పుడు రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. ఇవి కాకుండా రైతులందరూ ఒకేసారి విద్యుత్ వినియోగానికి సిద్ధం కావడంతో కరెంటు లోఓల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు రోజుల తరబడి తిరిగి సొంతంగా ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చేది. వైఎస్ హయాంలో ఇచ్చిన 9గంటల కరెంటులోనూ ఎప్పుడొస్తుందో తెలియలేదు. దీంతో రైతులు బోరు బావుల దగ్గరే రాత్రివేళ నిద్రించేవారు. ఈ క్రమంలో వందలు, వేలాది మంది రైతులు కరెంట్ షాక్, పాము, తేలు కాట్లకు గురై మృత్యువాత పడ్డారు. మూడు గంటల కరెంట్తో మళ్లీ ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
10 హెచ్పీ మోటర్ల ద్వారా నీళ్లు అందించవచ్చని అవగాహన రాహిత్యంతో రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు. నల్లగొండ జిల్లా భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాలు అందుబాటులో ఉన్న తీరును బట్టి ఇప్పటి వరకు రైతులు 3హెచ్పీ మొదలు 5హెచ్పీ మోటర్లను ఎక్కువగా వినియోస్తున్నారు. కానీ.. రేవంత్రెడ్డి చెప్పే 10హెచ్పీ మోటర్ల వినియోగం అసలు వ్యవసాయంలో ఇప్పటి వరకు లేదు. సాధ్యం కూడా కాదన్నది వ్యవసాయరంగ నిపుణులతో పాటు విద్యుత్ రంగంలోని అనుభవజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. ఇంతటి సామర్థ్యం కలిగిన మోటర్లు వినియోగించాలంటే కాల్వలకే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. భూమిలో నుంచి నీటి తోడితే కొద్దిసేపు కూడా పోయవని రైతులే చెబుతున్నారు.
దీనికితోడు ఉన్న మోటర్లను పక్కనేసి కొత్తగా 10హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలి. ఇలా చేయాలంటే మోటరుతో పాటు పైపులు, క్లాంపులు, వైర్లు, డబ్బా, స్టార్టర్లు అన్నింటికీ కలిపి తక్కువలో తక్కువ కనీసం లక్ష రూపాయలు రైతులపై అదనపు భారం తప్పదు. ఇలా నల్లగొండ జిల్లాలో మొత్తం 2.24లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. వాటన్నింటికీ లెక్కేస్తే 2,240 కోట్ల రూపాయలు రైతులు భరించక తప్పదు. సూర్యాపేట జిల్లా రైతులపై సుమారు రూ.1400 కోట్ల భారం పడనుంది. ఇంతటి భారం జిల్లాలో మెజార్టీ సంఖ్యలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఎలా సాధ్యమనేది కాంగ్రెస్ నేతలు చెప్పాల్సి ఉంటుంది.
నాకు 20 ఎకరాల భూమి ఉంది. కాంగ్రెస్ పాలనలో మూడు ఎకరాలు నాటు పెట్టి మిగతాది పడావు ఉంచుకునేది. త్రీ ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియక పడిగాపులు కాసేవాళ్లం. వచ్చే ఐదారు గంటల కరెంట్లోనే రాత్రి సమయంలో ఎక్కువ సేపు ఇచ్చేది. దాంతో టార్చిలైట్లు వేసుకొని మోటర్ వద్దకు వెళ్లి ఆన్ చేసుకునేవాళ్లం. రాత్రంగా పొలం గట్ల మీదనే పడుకునేవాళ్లం. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 3గంటల కరెంటు చాలని ప్రచారం చేయడం రైతు గొంతు కోసే పనే. 3గంటల కరెంట్కు కనీసం పది గుంటలు కూడా తడపలేము. రేవంత్రెడ్డి 10హెచ్పీ మోటర్ వాడాలని చెప్తున్నాడు. ఆ మోటరు కొనుగోలు చేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది సమంజసం కాదు. ఈ 10 సంవత్సరాల నుంచి 24గంటల కరెంట్ ఇవ్వడంతో 20 ఎకరాల్లో వరి పంట పండిస్తున్నా.
– మద్దిరాల ప్రతాప్రెడ్డి, రైతు, మంగాపురం, వేములపల్లి మండలం
మేము 3హెచ్పీ, 5హెచ్పీ మోటర్లను వాడుకొని పంటలు పండిస్తున్నాం. రేవంత్రెడ్డి చెప్పినట్లు 10హెచ్పీ మోటరు వేస్తే ఒక బావిలో గంటన్నరలోపు నీళ్లు అయిపోతాయి. తరువాత ఏం పెట్టి పంట పండించాలి. రైతులందరు ఒకేసారి పెడ్తే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. ట్రాన్స్ఫార్మర్ రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. అప్పుడు పొలమంతా ఎండిపోతుంది. ఎద్దు, వ్యవసాయం తెలిసినోడు ఈ మాటలు మాట్లాడడు. సీఎం కేసీఆర్ రైతుల బాధలు తెలిసినోడు కాబట్టి సరిపోను కరెంట్ అందిస్తూ పండించిన పంటను కొంటున్నారు. రైతులందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియ్యరు. రైతు బతికి ఉండాలంటే వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఉండాలి.
– శ్యాంసుందర్రెడ్డి, రైతు, త్రిపురారం
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలీచాలని కరెంట్ ఇచ్చేది. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియకపోయేది. ఒక్కోసారి రాత్రి ఒంటి గంటకు ఇచ్చేది. ఆ సమయంలో పొలాల దగ్గరే చలికి, దోమలకు, విష పురుగులతో భయపడుతూ పడుకునేది. రాత్రి పూట కరెంట్ కోసం ఎదురు చూసి రాకపోయేసరికి పడుకునేవాళ్లం. నిద్రపోతున్నప్పుడు కరెంట్ ఇచ్చేది.. లేచేసరికి బంద్ అయ్యేది. ఆటోమెటిక్ స్టార్టర్ పెడితే కరెంట్ మాటిమాటికి పోయి రావడంతో మోటర్లు కాలిపోయేది. దీంతో పొలాలు చేయాలంటే విరక్తి పుట్టేది. ఇప్పుడు 24గంటల విద్యుత్ ఇస్తుండడంతో ఏ సమయంలో అయినా పొలానికి పోయి నీళ్లు పెట్టుకొని చక్కగా పంటలు పడించుకుంటున్నాం.
– బండి శివ, రైతు, అడవిదేవులపల్లి
టల కరెంట్ ఏం సరిపోదు. ఒక మడి కూడా తడవదు.. పంట ఎండిపోతది. నేను 5 హాస్పర్ల మోటరు వాడుతున్నా. పది హాస్పర్ల మోటరు పెడితే నీళ్లు అందవు. మన బోర్లల్లో ఉండేవి గిన్నన్ని నీళ్లే.. ఏడికెళ్లి అయితది. కాల్వ అయితే 10 హాస్పర్ల మోటరు పోస్తది. 5 హాస్పర్ల మోటరు, 24 గంటల కరెంటే మంచిది. అప్పట్లో కరెంట్ సరిగా లేక చీకట్లో రైతులం కలిసి లైట్లు వేసుకొని పురుగు బూసి చూసుకుంటూ భయపడుతూ పొలాలకు పోయేటోళ్లం. ఇప్పుడు ఎవరూ బాయికాడ పడుకోవడం లేదు. నేను పొద్దున్నే పోయి పొలంలో నీళ్లు చూసుకుంటున్నా.
– రోశయ్య, రైతు, కోటయ్యగూడెం, చండూరు మండలం
నాకు ఐదెకరాల భూమి ఉన్నది. తొమ్మిదేండ్ల కింద కరెంట్ సరిగా రాకపోతే మోటరు పెట్టేందుకు పొలం దగ్గరే పడుకొని అర్ధగంటకు ఒకసారి లేచి చూసేటోన్ని. రోజు మొత్తం పొలం కాడనే పడిగాపులు కాసేటోన్ని. లో వోల్టేజీ కరెంట్ మూలంగా మోటర్లు, టాన్స్ఫార్మర్లు కాలిపోతుండేది. కష్టపడి పండించిన పంట పైసలన్నీ మోటర్లను బాగు చేయడానికి పెట్టేది. అప్పటి రోజులు మళ్లీ రావద్దని దేవుడిని మొక్కుకున్నా. దేవుడి రూపంలో సీఎం కేసీఆర్ సార్ రైతుల మేలుకోరి 24గంటలు ఫ్రీగా ఇస్తుంటే.. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్తుండ్రు. మూడు గంటల కరెంటుతో మూడెకరాల పొలం కూడా పారదు. తెలంగాణ ప్రభుత్వంలో కరెంటు బాధలు తప్పినయి. 24గంటల కరెంటుతో రెండు పంటలు పండిస్తున్నాం. రాత్రిళ్లు పొలానికి పోయే తిప్పలు తప్పినయి. ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక కాంగ్రెసోళ్లు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. రైతుల జోలికి వస్తే ఊరుకోం. మాకు నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి.
– సింగం నర్సింహ, రైతు, పులిపలుపుల, మునుగోడు మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 3గంటల కరెంట్ ఇస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. గతంలో ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఉదయం, రాత్రి మూడు మూడు గంటల చొప్పున కరెంట్ ఇచ్చేది. నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోయేది. వచ్చిపోయే కరెంట్తో కారుకు 3నుంచి 4సార్లు మోటర్లు కాలిపోయేది. దీంతో రైతులు పండించిన పంటలో సంగం మోటర్లకే పెట్టాల్సి వచ్చేది. పైగా మెకానిక్లు సరిగా రిపేర్ చేస్తలేరనే బదనాం వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడంతో కారుకు లేదంటే సంవత్సరానికోసారి మోటర్లు రిపేరుకు వస్తున్నాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులకు, మాకు ఇబ్బందులు తలెత్తక తప్పదు.
– బొంగరాల మల్లేశ్, మోటర్ మెకానిక్, ముసలమ్మచెట్టు, పెద్దవూర మండలం
సాధారణంగా 3హెచ్పీ మోటర్ కంటే 10 హెచ్పీ మోటర్కు ఎక్కువ కరెంట్ కావాల్సి ఉంటుంది. రేవంత్రెడ్డి చెప్పే మూడు గంటల సమయంలో అందరూ ఏకకాలంలో మోటర్లు ఆన్ చేస్తే భారీ లోడ్ పడుతుంది. ఇదే విషయాన్ని విద్యుత్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా లోడ్ ఎక్కువై పేలే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు 10హెచ్పీ సామర్థ్యం మోటర్లు వాడితే అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించాల్సి వస్తది. దీన్ని ఎలా సరిచేస్తారనేది సందేహాస్పదమే. ఇలా ఎన్నో సందేహాలు లేవనెత్తేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇలాంటి కాంగ్రెస్ను తెచ్చి నెత్తిమీద కూర్చోబెట్టుకుంటే ఇక రైతుల పని ఖతమేనన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. వ్యవసాయంపై కనీస అవగాహన లేక ఒకవైపు, పచ్చబడుతున్న వ్యవసాయాన్ని జీర్ణించుకోలేక మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుండడాన్ని రైతులు అసహ్యించుకుంటున్నారు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటే.. ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధే అవసరం లేదంటారు. ఇక రాహుల్గాంధీ ఏకంగా ధరణినే తీసేస్తామంటారు. ఇలాంటి నేతలతో రైతులు వేగేదెట్లా? వ్యవసాయం సాగేదెట్లా? అన్న చర్చ సర్వత్రా సాగుతున్నది.