యాదగిరిగుట్ట, ఆగస్టు 25 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం శ్రావణమాస వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని ఈశాన్య మండపంలో శ్రావణలక్ష్మీ కుంకుమార్చన అత్యంత వైభవంగా సాగాయి. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, స్వామివారి శెల్లా, కనుము, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. స్వయంభూ పంచనారసింహస్వామిగా వెలిసిన దివ్యక్షేత్రంలో నిత్యపూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
తిరువారాధన, బాలభోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. ప్రధానాలయ లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా జరుపగా.. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చకున్నారు. క్యూ కాంప్లెక్స్ చెంతన కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం ప్రధానాలయ ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ నారసింహుడిని ప్రధానాలయంలోని వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో ఉయలలో శయనింపు చేయించారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఖజానాకు రూ.24,82,082 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామికి హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, స్వప్న దంపతులు 5 వెండి కలశాలను బహూకరించారు. శుక్రవారం స్వామివారిని దర్శించుకుని కలశాలను అధికారులకు అందజేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పుర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురారోపణంతో ఉత్సవాలను ప్రధానార్చకుల బృందం ప్రారంభించనున్నది. మొదటి రోజు కంకణధారణ పూజ, మృత్స్యంగ్రహణం, పాలికాది హోమం నిర్వహించనున్నారు.
పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవం అనే వైదృశ్య కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. సకల పాపాలకు ప్రయోచ్చితంగా ఈ ఉత్సవం పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం జరుపబడుతుందని చెప్పారు. ఈ వైదృశ్య కార్యక్రమంలో చతుస్థానార్చన పూర్వకంగా స్వామివారిని బింభం, కుంభం, కుండం, మండలం యందు ఆవాహనం చేసి, ఆరాధిస్తూ ప్రత్యేకమైన అభిషేకాలను నిర్వహిస్తామన్నారు. మహానివేదనలు సమర్పించి పవిత్ర మాలలను ధరింపజేస్తామని చెప్పారు. సోమవారం వరకు సాగే ఉత్సవాలకు ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపం ఎదురుగా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పవిత్రోత్సవాల్లో భా గంగా 27, 28 తేదీల్లో ఆర్జిత పూజల ను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు.