యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాడవీధులు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాల భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకోగా ఆలయానికి రూ.59,04,585 ఆదాయం సమకూరింది. వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను ఆదివారం ఆలయ ఈఓ ఎన్.గీత ప్రారంభించారు. లక్ష్మీనరసింహస్వామి, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా యాదాద్రి దేవస్థానంలో శిల్ప కళాశాల ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు.
యాదాద్రి, డిసెంబర్ 4 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. దాంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. ప్రసాద విక్రయశాలలో రద్దీ నెలకొన్నది. కొండపైకి వాహనాలు బారులుదీరాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనం, స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు.
స్వామివారి ప్రధానాలయంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పూలతో పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 42వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.59,04,585 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను ఆలయ ఈఓ ఎన్.గీత ఆదివారం ప్రారంభించారు. లక్ష్మీనరసింహస్వామి, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులను ప్రారంభించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శిల్పకళా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా యాదాద్రి దేవస్థానంలో శిల్పకళా కళాశాల ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ఉత్సాహవంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మోతీలాల్, గెస్ట్ లెక్చరర్లు హేమాద్రి, మొగిలి, సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ జానకమ్మ, అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన భక్తుడు సుమన్ సిద్ధార్థ వెండితో రూపొందించిన 11 తమల పాకులు బహూకరించారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయ అధికారులకు వెండి తమల పాలకులను అందజేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో తిరుమంగై తిరునక్షత్రోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆళ్వారులను దివ్య మనోహరంగా అలంకరించారు. ప్రధానార్చకుడు మోహనాచార్యులు ఆధ్వర్యంలో తొళక్కం నిర్వహించి, ప్రబంధ పారాయణాలు పఠించారు. కార్యక్రమంలో ఆలయ పారాయణందారులు, అధ్యాపకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,27,100
్రప్రధాన బుక్కింగ్ ద్వారా 5,13,000
వీఐపీ దర్శనాలు 4,80,000
బ్రేక్ దర్శనాలు 3,86,400
వేద ఆశీర్వచనం 12,600
నిత్య కైంకర్యాలు 1,100
సుప్రభాతం 16,000
ప్రచార శాఖ 1,07,500
వ్రత పూజలు 2,56,700
కళ్యాణకట్ట టిక్కెట్లు 1,34,200
ప్రసాద విక్రయం 27,79,300
వాహన పూజలు 27,300
అన్నదాన విరాళం 22,151
శాశ్వత పూజలు 57,300
సువర్ణ పుష్పార్చన 1,46,192
యాదరుషి నిలయం 1,70,500
పాతగుట్ట నుంచి 91,940
కొండపైకి వాహన ప్రవేశం 6,00,000
శివాలయం 10,900
ఇతర విభాగాలు 91,766