నందికొండ, జూలై 24 : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు కృష్ణమ్మ పరుగులు పెడుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగుల మేర నీరు పెరిగి డ్యాం గేట్లకు తాకింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులకు గాను ఆదివారం నాటికి 542 అడుగులకు చేరుకొని 192.5190 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 53,580 క్యూసెక్కులు, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 57,585 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వస్తుంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎస్ఎల్బీసీకి 1000 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులకు గాను 882(200 టీఎంసీ) అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతుండడంతో ఈ యేడాది కూడా ముందస్తుగానే ఎడమకాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.