రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో పాత కలెక్టరేట్లో ఏర్పాటుచేస్తున్న ఐటీ హబ్ను ప్రారంభించనున్నారు. వాటితోపాటు నల్లగొండలో రూ.234 కోట్లతో నిర్మించనున్న కళాభారతి, పానగల్ ఉదయ సముద్రం చెరువు, వల్లభరావు చెరువులను ట్యాంకుబండ్లుగా తీర్చిదిద్దే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో సాయంత్రం బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్ శుక్రవారం ఫైనల్ కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
సూర్యాపేటకు ఐటీ హంగులు
సూర్యాపేటను మినీ హైదరాబాద్గా మార్చేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాయకత్వంలో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సకల సౌకర్యాలతో జిల్లా కేంద్రం నంబర్ వన్గా నిలుస్తుండగా తాజాగా పాత కలెక్టరేట్ భవనం ఐటీ హబ్గా మారబోతున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో, ఐటీ కంపెనీల ప్రతినిధులతోమంత్రి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఐటీ హబ్ ప్రారంభం అనంతరం స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ): అక్టోబర్ 2న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనకు రానున్నారు. ఒకే రోజు ఉదయం సూర్యాపేటలో, మధ్యాహ్నం తర్వాత నల్లగొండల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి ముందుగా సూర్యాపేటలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక్కడ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయనున్న ఐటీ హాబ్ను ప్రారంభించనున్నారు. గత నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభమైంది. కొత్త భవనంలోకి కలెక్టరేట్ మారడంతో దురాజ్పల్లి సమీపంలోని పాత కలెక్టరేట్ భవనం ఖాళీ అయ్యింది. దాంతో ఆ భవనంలోనే ఐటీ హబ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని పలువురు ఐటీ నిపుణులతో మంత్రి జగదీశ్రెడ్డి సమాలోచనలు చేశారు.
మంత్రి కేటీఆర్తోనూ దీనిపై చర్చించారు. మంత్రి జగదీశ్రెడ్డి ఆలోచనలకు ఐటీ మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కొత్తగా ఐటీ టవర్ నిర్మాణం జరిగే వరకు పాత కలెక్టరేట్లోనే ఐటీ హబ్ ఏర్పాటుకు సన్నాహాకాలు చేస్తున్నారు. వచ్చే నెల 2న కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హాబ్ను ప్రారంభించాలని మంత్రి జగదీశ్రెడ్డి నిర్ణయించారు. ఇదే సందర్భంగా ఐటీ టవర్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం
నల్లగొండ జిల్లా కేంద్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటున్న ఐటీ టవర్ను వచ్చే నెల 2న కేటీఆర్ ప్రారంభించనున్నారు. సూర్యాపేటలో ఉదయం పర్యటన అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం నల్లగొండకు రానున్నట్లు తెలిసింది. నల్లగొండలో రూ.74 కోట్లతో నిర్మాణం చేసిన ఐటీ హాబ్ నూతన భవనాన్ని మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 2021 డిసెంబర్ చివరల్లో నల్లగొండలో పర్యటించిన సీఎం కేసీఆర్ నల్లగొండ రూపురేఖలు మార్చనున్నట్లు ప్రకటించారు.
అందులో భాగంగా ఐటీ హబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇప్పటికే 15 ఐటీ కంపెనీలు తమ శాఖలను ప్రారంభించడానికి ముందుకు వచ్చి తొలి దశలో 550 మందికి పైగా మెగాజాబ్ మేళాలో ఐటీ ఉద్యోగులను ఎంపిక చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి ఐటీ హబ్ నుంచే కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇక వీటితో పాటు రూ.234 కోట్లతో నిర్మించనున్న నల్లగొండ కళాభారతి, పానగల్ ఉదయ సముద్రం ట్యాంకుబండ్తో పాటు వల్లభరావుచెర్వు, ట్యాంకుబండ్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇంకా సీఎం హామీ మేరకు ఇప్పటికే పూర్తయిన పలు జంక్షన్లను, జంక్షన్లలో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాలను కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇదే సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో సాయంత్రం బహిరంగసభ నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. అయితే ఇదే విషయమై మంత్రి జగదీష్రెడ్డి స్పందిస్తూ… వచ్చే నెల 2న సూర్యాపేట, నల్లగొండల్లో మంత్రి కేటీఆర్ పర్యటన దాదాపు ఖరారైనట్లేనని వెల్లడించారు. అయితే తుది షెడ్యూల్పై నేడు మరింత స్పష్టత రానున్నట్లు తెలిపారు.