కొండమల్లేపల్లి, ఏప్రిల్ 24 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని దేవరకొండ ఆర్డీఓ గోపీరాం అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని చిన్నఅడిశర్లపల్లి సమీపంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లలో ఆలస్యమవుతుండడంతో రైతులు సోమవారం హైదరబాద్- సాగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాలు యంత్రంలో ధాన్యం పోయకుండా తేమ శాతం చూసి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. దాంతో ఆయన ఫోన్లో జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణూధర్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వీరబాబు, సీఈఓ పల్లా తిరుపతిరెడ్డి, రైతులు ఉన్నారు.