దామరచర్ల, ఫిబ్రవరి 19 : యాదాద్రి పవర్ప్లాంటులో మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో అన్ని అనుమతులు తీసుకొని ప్లాంటు నిర్మాణం చేపట్టింది. ప్లాంటులో రెండు యూనిట్లు పూర్తి కావడంతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధ్దం కాగా మిగిలిన మూడు ప్లాంట్లు 80 శాతం వరకు పూర్తయ్యాయి.
ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఇద్దరు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దాంతో పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయం చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం చేశారు. ప్లాంటు వద్ద టెంట్లు వేసి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభకు జెన్కో సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, డీఐజీ హాజరుకానున్నారు.