నిడమనూరు, మే 6: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మం డలంలో పోటీ చేసిన అభ్యర్థులు చెల్లించిన నామినేషన్ ధరావత్తును తక్షణం చెల్లించాలంటూ జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన ఆదేశాలు అధికారులు పట్టించుకోవడం లేదు. డిసెంబర్లో మండల పరిధిలోని 29 పంచాయతీల్లో పోటీ చేసిన 83 మంది సర్పంచ్ అభ్యర్థులు, 218 వార్డు సభ్యులు నామినేషన్ వేస్తూ ధరావత్తు చెల్లించారు. కొందరు రిటర్నింగ్ అధికారులు కొంత మంది అభ్యర్థులకు తిరిగి చెల్లించగా మిగతా ధరావత్తు సొమ్ము రూ.2.55 లక్షలు ఎంపీడీవోకు అప్పగించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులకు ధరావత్తు చెల్లించకపోవడంతో మార్చి 5న నమస్తే తెలంగాణ దినపత్రిలో ‘ధరావత్తు సొమ్ము ఏమాయే.’ శీర్షికన వార్తా కథనం వెలువడింది. స్పందించిన డీపీవో శంకర్ నాయక్ మార్చి 7న చెల్లించాలంటూ ఆదేశించారు. ఐదు నెలలుగా ధరావత్తు చెల్లించకుండా అధికారులు తాత్సారం చేస్తుండటంతో పోటీ చేసిన అభ్యర్థులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఇవ్వం గాక.. ఇవ్వం!
డిపాజిట్ సొమ్ము ఇవ్వమంటూ ఎంపీడీవో తెగేసి చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ ఖర్చులుంటాయని, మిగతా చోట్ల ఎక్కడా ఇవ్వలేదని, తాము కూడా ఇవ్వబోమంటూ ఎంపీడీవో చెప్పినట్లు పలువురు అభ్యర్థులు, సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు కాసులకక్కుర్తికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలంటూ పలువురు నమస్తే తెలంగాణ విలేకరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ సొమ్మును ఎంపీడీవో తన వద్దనే ఐదు నెలలుగా పెట్టుకొని, అభ్యర్థులకు పం పిణీ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపీడీవో హిమబిందు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గత నెల 9న వెళ్లడంతో అభ్యర్థులకు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. ఈ విషయమై ఇన్చార్జి ఎంపీడీవో భోనగిరి రమేశ్ను వివరణ కోరగా ధరావత్తు నగదు రూ.2.55 లక్షలు ఎంపీడీవో హిమబిందు వద్ద ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపీడీవో శిక్షణలో ఉన్నందున ధరావత్తు సొమ్ము అభ్యర్థులకు చెల్లించినదీ లేనిది తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు.