రాజాపేట, ఆగస్టు 20 : వానకాలంలో రైతులు వర్షాలపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బోర్లను నమ్ముకొని వరి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బొందుగులకు చెందిన బాల్ద నరసయ్య తనకు ఉన్న మూడెకరాల భూమిలో రెండు బోర్లపై ఆధారపడి వానకాలం సీజన్లో వరి సాగు చేశాడు. పంట సాగు కోసం సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లలో నీరు లేకపోవడంతో వరి పంటకు సాగునీరు అంద లేదు.
కండ్ల ఎదుటే పచ్చగా ఉండాల్సిన పైరు క్రమంగా ఎండిపోయి, చివరకు పూర్తిగా దెబ్బతింది. చేసేదేమీ లేక ఎండిన వరి చేనును పశువులకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘మూడెకరాల్లో వరి సాగు చేశా. రెండు బోర్లను నమ్ముకొని రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుందని ఆశపడ్డా. కానీ వానల్లేక రెండు బోర్లూ ఎండిపోయాయి. పంటకు నీరందక మొత్తం ఎండిపోయింది. చివరకు పశువులకు మేతగా వదిలేయాల్సి వచ్చింది. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలి’ అని రైతు నరసయ్య కన్నీటిపర్యంతమయ్యాడు.