యాదాద్రి, అక్టోబర్ 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి కల్యాణోత్సవంలో, సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవల్లో, సత్యనారాయణస్వామి వ్రతాల్లో, ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండ కింద నిర్మితమైన కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.25,99,191 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వయంభూ నారసింహుడి దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.