యాదాద్రి, సెప్టెంబర్ 22 : స్వయంభూ పంచనారసింహుడిగా కొలువైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి నిత్యారాధనలను అర్చక బృందం గురువారం ఘనంగా నిర్వహించింది. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. అనంతరం సుమారు గంటన్నర పాటు నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.
స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలో భాగంగా తిరువీధి సేవ, దర్బార్ సేవ, తిరువారాధన ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానకు రూ.10,75,641 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రీశుడిని డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ దయానందం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.