సూర్యాపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జనరల్ దవాఖానలో ఓ వింత జరుగుతోంది. రూ.ఐదు లక్షలతో షెడ్డు నిర్మించాల్సి ఉండగా పాత రేకులు, రాడ్లు తెచ్చి నిర్మిస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్బంగా ఓపీ చిట్టీలు తీసుకునే చోట రోగులు ఎండలో ఉండటంతో గమనించిన వెంటనే దవాఖాన అధికారులు, కాంట్రాక్టర్ను పిలిచి రూ.5 లక్షలు మంజూరు ఇస్తున్నా.. వెంటనే షెడ్డు నిర్మించాలని ఆదేశించారు. నెలలు దాటినా నిర్మించలేదు. ఇటీవల కలెక్టర్ దవాఖానకు వెళ్లగా అక్కడ షెడ్డు లేకపోవడంపై అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బు మంజూరు చేసినా ఎందుకు నిర్మించలేదనగా ఏవో కుంటి సాకులు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో వెంటనే షెడ్డు నిర్మించాలని ఆదేశించడంతో హుటాహుటిన పనులు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్మించిన షెడ్డుకు పాత రేకులు, రాడ్లను వినియోగించారని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలియడంతో… అక్కడకు వెళ్లి పరిశీలించగా పాతవే దర్శనమిచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. రెండేండ్ల కాంగ్రెస్ హయాంలో దవాఖానకు వెళ్తే అక్కడ దిగజారిపోతున్న వైద్య సేవలు, పర్యవేక్షణ కరువు.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు మారిపోతుండటం బాధ కలిగిస్తోందని పలువురు వాపోతున్నారు.
దవాఖానలో ఒక సాధారణ వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తినా గుర్తించలేని దుస్థితి నెలకొన్న విషయం విదితమే. ఆరోగ్య శ్రీ డబ్బులు పక్కదారి పట్టించారు. ప్రభుత్వం మారిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు మారడం.. తదనంతరం ఒక్కో ఉద్యోగి నుంచి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అక్రమంగా ముక్కుపిండీ వసూలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ కూడా చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలున్నాయి. తాజాగా ఓపీ షెడ్డు నిర్మాణం కోసం రూ.5 లక్షలను జిల్లా కలెక్టర్ ఇస్తే అక్కడ పాత సామగ్రిని వినియోగించడంపై ఆసుపత్రి వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రూ.ఐదు లక్షలను తిలాపాపం తలా కొంచం అన్న చందంగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.