తుర్కపల్లి, జనవరి 24 : వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణానికి గ్రామస్తులు వ్యక్తిగత అంగీకార పత్రం ఇవ్వాలని, అన్ని కుటుంబాలకూ కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో మంగళవారం గ్రామాభివృద్ధి పునర్నిర్మాణంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన గ్రామ పునర్నిర్మాణ లేఅవుట్కు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2020లో గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి పాత ఇండ్లను మొత్తం కూల్చి అధునాతన హంగులతో నూతన గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగా అధికారులు ఇప్పటికే గ్రామంలో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి లేఅవుట్ను సిద్ధం చేశారని చెప్పారు. గ్రామంలో మొత్తం 35ఎకరాల విస్తీర్ణంలో 584 ఇండ్లు ఉన్నాయని, అందులో 333 ఇండ్లు శిథిలావస్థలో ఉండగా.. 103 పక్కా గృహాలు ఉన్నట్లు అధికారులు తేల్చారన్నారు.
గ్రామ పునర్నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న పక్కా ఇండ్లను యథావిధిగా ఉంచడంతోపాటు 200 చదరపు గజాల స్థలాల్లో 481 నూతన గృహాల నిర్మాణం చేపట్టేందుకు లేఅవుట్కు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ లేఅవుట్లో 33, 45 ఫీట్ల రోడ్లు, డ్రైనేజీ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామంలో 200 గజాలకు పైగా స్థలాలున్న వారికి గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 289 ప్రభుత్వ భూమిలో స్థలానికి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంతంగా ఇండ్లు కట్టుకునేవారు నిబంధనలకు లోబడి నిర్మించుకోవచ్చన్నారు. వారికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు అందిస్తుందన్నారు. అధికారులు సిద్ధం చేసిన లే అవుట్ను రెండు, మూడ్రోజుల్లో కలెక్టరేట్లో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తామని చెప్పారు.
రోజుకు 50 కుటుంబాలకు లేఅవుట్పై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేసిందని, త్వరలో పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ భవన నిర్మాణ స్థలాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో డీఆర్డ్ఓ మందడి ఉపేందర్రెడ్డి, డీపీఓ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, డీఎల్పీఓ యాదగిరి, ఆర్అండ్బీ డీఈ గిరిధర్, ఏడీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఉమాదేవి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్ పాల్గొన్నారు.