రామగిరి, ఏప్రిల్ 27 : నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతన టెక్నాలజీతో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయం ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్కుమార్, కె.లక్ష్మణ్, బి.విజయసేన్ రెడ్డికి నల్లగొండ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. మంగవాయిద్యాలతోపాటు పోలీసుల గౌవర వందనం చేశారు. అనంతరం రెండు అంతస్తులతో నూతన టెక్నాలజీతో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయాన్ని వారు ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కోర్టులు, సమావేశ మందిరం తదితర వాటిని తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే మాట్లాడుతూ వందశాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నదన్నారు. ఆ దిశగా కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ టెక్నాలజీని అందిస్తున్నామని స్పష్టం చేశారు. నల్లగొండలో నూతనంగా నిర్మించిన ఐదు కోర్టుల ఆధునిక భవనంలో డిజిటలైజేషన్తోపాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ముఖ్యంగా లైబ్రరీ, రిక్రీయేషన్ వంటి అన్ని సౌకరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కోర్టులో అత్యధిక కేసులు పరిష్కారం అవుతున్నాయని, ఆ దిశగా బార్ అండ్ బెంచ్ సహకారం ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయాధికారులు, న్యాయవాదులు ఎప్పటికప్పుడు సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టలపై అవగాహన పెంచుకోవడంతోనే వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. తెలంగాణలో 8,500పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయని, నల్లగొండ జిల్లాలో కూడా వంద శాతం కేసులు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.
ఇకపై కోర్టుల సముదాయంలో నల్లగొండ జిల్లా కోర్టులో కేసులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉందని అన్నారు. న ల్లగొండ బార్ అసోసియేషన్ అండ్ బెంచ్ సమన్వయంతో పనిచేస్తూ న్యాయం కోసం వచ్చే ప్రజలకు సహకరించాలని కోరారు. నల్లగొండలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభ ఉపన్యాసం చేసి మాట్లాడారు. జిల్లా కోర్టు చరిత కోర్టులో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి, జిల్లా కోర్టులోని వివిధ కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులకు కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, ఏఎస్పీ రాములునాయక్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సమావేశం ముగింపులో పబ్లిక్ ప్యాసిక్యూటర్స్, సీనియర్ న్యాయవాదులు, డిఫెన్స్ న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు కూడా వారికి పుష్ఫగుచ్ఛాలతోపాటు జ్ఞాపికలు అందించారు.