నల్లగొండ రూరల్, ఆగస్టు 29 : నల్లగొండ పట్టణంలోని కలెక్టరేట్లో హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా శనివారం క్రీడా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఖో ఖో క్రీడాకారిణి, జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన దేవరపల్లి రోహితకు నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఖో ఖో ఆటలో నల్లగొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నందుకు ఖో ఖో సంఘం అధ్యక్ష కార్యదర్శులు, శ్రీనివాసు, నాతి కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆదిరెడ్డి, కార్పొరేటర్ సుభాష్, డీవైఎస్ఓ అక్బర్ అలీ కోచ్, అయితగోని విజయ్, నారి వెంకటరెడ్డి, కరీం పాల్గొన్నారు.