‘దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సరిహద్దులో పోరాడుతూ దేశ రక్షణలో భాగస్వాములయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. బాధ్యతగా విధులు నిర్వర్తించి పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలి’ అని రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన 43 మంది సైనికులు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను క్యాంప్ కార్యాలయంలో మంత్రి మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు కండ్ల ముందే ఉండి ఉద్యోగం చేయాలని ఆశ పడుతున్న తరుణంలో బిడ్డలను దేశ కోసం పోరాడేందుకు పంపించడం అభినందనీయమన్నారు. ఈ అగ్నివీరులు యువతకు మార్గదర్శకులు అవుతారని తెలిపారు. యువత విభిన్న రంగాల్లో లక్ష్యాలను ఏర్పర్చుకుని సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగార్థులు కొలువుల వేటలో బిజీగా ఉన్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో గ్రంధాలయాలు, స్టడీ సర్కిళ్లు విద్యార్ధులతో సందడిగా మారాయని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.
రామగిరి, ఫిబ్రవరి 21: బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు సర్వే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా చేపట్టారు. విద్యాశాఖ -సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గత నెల 18 నుంచి 31 వరకు క్లస్టర్, మండలాల వారీగా సర్వే చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,249 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని ప్రబంద్ పోర్టల్లో నమోదు చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం బడీడు పిల్లలు బడిలో ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు చదువుకు దూరంగా ఉన్న 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నది. దాంతో పాటు బాల కార్మికులుగా ఉంటున్న 15 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు సైతం ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నది. గత నెలలో జరిపిన ‘బడి బయటి పిల్లల సర్వే’లో గుర్తించిన పిల్లల్లో కొంత మందిని ఇప్పటికే బడిలో చేర్పించారు. మిగిలిన వారిని 2023-24 విద్యాసంవత్సరంలో బడిలో చేర్పించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇంకా డ్రాప్అవుట్స్ ఉన్నారా అనే వివరాలను సైతం సేకరిస్తున్నది.
‘బడిబయటి పిల్లల సర్వే’ 2022-23ను సీఆర్పీలు, ఐఆర్పీలు గత నెల 18 నుంచి 31 వరకు క్లస్టర్ స్థాయిలో నిర్వహించి ఎంఆర్పీలకు అందజేశారు. వాటిని ఎంఐఎస్ కోఆర్డినేటర్, కంప్యూర్ ఆపరేటర్ల సాయంతో మండలాల వారీగా ప్రబంద్ పోర్టల్లో నమోదు చేశారు. ఇంకా డ్రాప్అవుట్స్గా ఉన్న పిల్లలను గుర్తించే పనిలో సీఆర్పీలు ఉన్నారు. ఈ పనిని ఈ నెలాఖరు వరకు పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధికంగా బడి బయటి పిల్లలు ఇటుక బట్టీల్లో, పంట పొలాల్లో, హోటల్స్లో పనిచేస్తున్నట్లు తేలింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటుకబట్టీల వద్దే అధిక మంది పిల్లలను అధికారులు గుర్తించారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు చెందిన వారే. వీరిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించినప్పటికీ పనులు ముగియగానే వారు తమ స్వస్థలాలకు వెళ్లి పోనున్నారు.
మొత్తం 49 అంశాలతో సర్వే చేపట్టారు. ఇందులో విద్యార్థి పేరు, ఆధార్ సంఖ్య, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ సభ్యుల జీవనాధారం వంటి ఇతర అంశాలను సైతం నమోదు చేశారు. నెవర్ ఎన్రోల్డ్, డ్రాప్అవుట్స్, వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలు ఇలా వివిధ రకాలుగా సర్వే చేశారు. గతంలో గుర్తించిన (గత సంవత్సరం సర్వేలో) బడిబయటి విద్యార్థుల వివరాలు అప్డేట్ చేశారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఎంఈఓలు సమన్వయకర్తలుగా వ్యవహరించి సీఆర్పీలు చేసిన సర్వేను పూర్తి చేశారు. విద్యార్థులు బడి బయట ఉండడానికి తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులతో ఉండడం కారణంగా తేలింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది 1,091మంది విద్యార్థులు బడి బయట ఉన్నట్లు తేలింది. ఇందులో నల్లగొండ జిల్లాలో 283, సూర్యాపేట జిల్లాలో 286, యాదాద్రిభువనగిరి జిల్లాలో 522 ఉన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన సర్వేలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,249 మంది బడి బయట ఉన్నట్లు తేలింది.
బడిబయటి పిల్లల గుర్తింపు కోసం ఈ విద్యాసంవత్సరం సర్వే జరిగింది. ఇందులో నల్లగొండ జిల్లాలో 438 మంది పిల్లలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఎక్కువ మంది వలస కార్మికుల పిల్లలే ఉన్నారు. ఇప్పటికే చాలా మందిని ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాం. గత సంవత్సరం గుర్తించిన వారిని కూడా బడిలో చేర్పించాం. నల్లగొండ జిల్లాలో బడిబయటి పిల్లల నమోదు సున్నాశాతం ఉండేలా చూస్తాం.
– బి. భిక్షపతి, డీఈఓ, నల్లగొండ