కరువు నేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ భువనగిరి మండలం బస్వాపూర్లో నిర్మిస్తున్న నృసింహ సాగర్ జలాశయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దానికి అనుబంధంగా వివిధ గ్రామాలకు నీరందించేందుకు కాల్వ పనులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టారు. బస్వాపూర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,059 కోట్లు కేటాయించగా రూ. 616.65 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 50.530 కిలోమీటర్ల ప్రధాన కాల్వలో దిగువ కాల్వ 49.883 కిలోమీటర్లు ఉండగా కాల్వ తవ్వకం, కట్టడాల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు, మైనర్లు, సబ్ మైనర్ల కాల్వ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తికాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి.
కాళేశ్వరం 15వ ప్యాకేజీ ప్రధాన గ్రావిటీ కాల్వ ద్వారా 2,473 క్యూసెక్కుల ప్రవాహం గల నీరు 16వ ప్యాకేజీ కింద 1,65,500 ఎకరాల ఆయకట్టుకు అందనుంది. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో 36.609 కిలోమీటర్ల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ అయిన నృసింహసాగర్ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రధాన కాల్వ 5.19 కిలోమీటర్లు ప్రవహించి 41.80 కిలోమీటర్ల వద్ద సుమారు 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతున్న బస్వాపూర్ జలాశయంలోకి గోదావరి జలాలు వస్తాయి.
బస్వాపూర్ జలాశయం మెయిన్ రెగ్యులేటర్ వద్ద నుంచి ప్రారంభమైన ప్రధాన దిగువ కాల్వ భువనగిరి అరోరా కళాశాల మీదుగా రైల్వే ట్రాక్ బ్రిడ్జి నుంచి రాయగిరి కలెక్టరేట్ కార్యాలయం గుండా కేసారం, పెంచికల్పహాడ్, రామచంద్రాపురం, తుక్కాపురం, చందుపట్ల, గౌస్నగర్ గ్రామాలను తాకుకుంటూ ఎర్రబెల్లి వద్దకు చేరుకుంటుంది. ఎర్రబెల్లి వద్ద మరో క్రాస్ రెగ్యులేటర్ నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రధాన కాల్వలో డిస్ట్రిబ్యూటర్ కెనాల్ (ఓటీ-5) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ వీరవెల్లి గ్రామాన్ని తాకుతూ మోటకొండూర్ మండలంలోని కదిరేణిగూడెం, ఆత్మకూరు(ఎం) మండలం మీదుగా వెళ్తుంది.
ఇక ఎర్రబెల్లి నుంచి ప్రధాన కాల్వ నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి, భువనగిరి మండలంలోని సూరేపల్లి(ఎం), భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి, వలిగొండ మండలంలోని టేకుల సోమారం, పహిల్వాన్పూర్ బునాదిగాని కాల్వను దాటుకుంటూ వర్కట్పల్లి మీదుగా చౌటుప్పల్ మండలంలోని జై కేసారం, నేలపట్ల, రామన్నపేట మండలంలోని వెల్లంకి వరకు చేరుకుంటుంది. వెల్లంకి వద్ద ప్రధాన కాల్వ రెండు భాగాలుగా విభజన చేశారు. అక్కడి నుంచి ఎడమ కాల్వ చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలకు తాకుతూ 13.7 కిలోమీటర్లు ప్రవహించి శివనేనిగూడెం వద్ద ముగుస్తుంది.
కుడి కాల్వ చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల, జైకేసారం, కంచనపల్లి, పంతంగి, లింగోజిగూడెం గుండా 16.15 కిలోమీటర్లు ప్రవహించి సంస్థాన్ నారాయణపురం మండలంలోని కోతులాపురం గ్రామం వద్ద ముగుస్తుంది. ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా 2 మీటర్ల నుంచి 6 మీటర్ల వెడల్పుతో కాల్వ పనులు చేపట్టారు. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి వద్ద ప్రారంభమైన ప్రధాన ఎగువ కాల్వ, నృసింహసాగర్ మెయిన్ రెగ్యులెటర్ వద్ద ప్రారంభమైన ప్రధాన దిగువ కాల్వ సంస్థాన్ నారాయణపురం మండలంలోని కోతులాపురం వరకు 50.530 కిలోమీటర్ల దూరం ప్రవహించనుంది. ప్రధాన దిగువ కాల్వ 49.883 కిలోమీటర్లు ప్రవహిస్తుండగా, 38.833 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వకం, 30 కిలోమీటర్ల వరకు సీసీ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మిగతా 11.050 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
నృసింహసాగర్లో గోదావరి జలాలు..
నృసింహసాగర్ జలాశయానికి గతంలో 0.8 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 11.39 టీఎంసీలకు పెంచారు. ప్రస్తుతం 0.4 టీఎంసీల నీరు నిల్వ చేసేలా పనులు పూర్తయ్యాయి. మార్చి 26న గోదావరి జలాలతో నృసింహస్వామి జలాశయాన్ని నింపారు.
పనుల్లో వేగం పెంచాం
కాళేశ్వరం ప్రాజెక్టులోని 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నృసింహసాగర్ (బస్వాపూర్) జలాశయం నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.1,059 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.616.65 కోట్లు ఖర్చు చేశాం. మొత్తం జలాశయం, ఎగువ, దిగువ కాల్వలు నిర్మించేందుకు 5,891 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. 1,323 ఎకరాలు సేకరించాం. మిగతా 4,568 ఎకరాల భూమి సేకరణ జరుగుతున్నది. 13 ఆఫ్టెక్ కాల్వలు, ప్రధాన ఎగువ, దిగువ, కుడి, ఎడమ కాల్వల పనుల వేగం పెంచాం. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. గడువులోపు జలాశయం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
– ఖుర్షిద్ మొహినుద్దీన్, కార్యనిర్వాహక ఇంజినీర్, కాళేశ్వరం ఇరిగేషన్ డివిజన్ నం.3, భువనగిరి
హెచ్ఎల్ఎంసీతో మరో 22,500 ఆయకట్టు స్థిరీకరణ
బస్వాపూర్ జలాశయంలోని నీటిని ఎక్కువ మొత్తంలో వినియోగించాలన్న సంకల్పంతో మరో హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్ఎల్ఎంసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బస్వాపూర్ జలాశయం 13.7 కిలోమీటర్ల చెరువు కట్ట వద్ద నిర్మించిన అలుగు నుంచి హెచ్ఎల్ఎంసీ నిర్మించనున్నారు. ఈ కాల్వ వడపర్తి, అనంతారం నుంచి పగిడిపల్లి.. అక్కడి నుంచి రెండు పాయలుగా విడిపోతుంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ, సర్వే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కాల్వ ద్వారా భువనగిరి మండలంలో మరో 22,500 అయకట్టును స్థిరీకరించనున్నారు.
13 డిస్ట్రిబ్యూటర్ కాల్వలు.. 1,65,550 ఎకరాల సాగు
బస్వాపూర్లోని నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతోపాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్ మైనర్ కాల్వలను నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాల్వల (ఆఫ్టెక్)ను ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగు నీరు అందించేందుకు పనులు చేపడుతున్నారు.
ఇందులో ప్రధానంగా మేజర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్- ఆఫ్టెక్-1 ద్వారా తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 2,576 ఎకరాల ఆయకట్టు, ఆఫ్టెక్-2 ద్వారా యాదగిరిగుట్ట, మోటకొండూరు, భువనగిరి మండలంలోని బస్వాపూర్, ఆత్మకూరు(ఎం), ఆలేరు, గుండాల మండలాల్లో 47,722 ఎకరాలు, ఆఫ్టెక్-3 ద్వారా యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లోని 3,561 ఎకరాలు, ఆఫ్టెక్-4తో భువనగిరి, మోటకొండూరు, యాదగిరిగుట్ట మండలాల్లో 10,866 ఎకరాలు, ఆఫ్టెక్-5తో మోటకొండూరు, భువనగిరి, మోత్కురు, ఆత్మకూరు(ఎం) మండలాల్లోని 66,500 ఎకరాలు, ఆఫ్టెక్-6 ద్వారా భువనగిరి, వలిగొండ మండలాల్లో 14,250 ఎకరాలు,
ఆఫ్టెక్-7తో వలిగొండ మండలంలో 500 ఎకరాలు, ఆఫ్టెక్-8 ద్వారా వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1,370 ఎకరాలు, ఆఫ్టెక్-9తో వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 130 ఎకరాలు, ఆఫ్టెక్-10 ద్వారా వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 235 ఎకరాలు, ఆఫ్టెక్-11 ద్వారా వలిగొండ, చౌటుప్పల్లో 225 ఎకరాలు, ఆఫ్టెక్-12 ద్వారా వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లో 2,750 ఎకరాలు, ఆఫ్టెక్-13 ద్వారా వలిగొండ, రామన్నపేట మండలాల్లో 750 ఎకరాలు, ప్రధాన ఎడమ కాల్వతో రామన్నపేట, వలిగొండ, నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలంలో 12,440 ఎకరాలు, ప్రధాన కుడి కాల్వతో చిట్యాల, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని 1,850 ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు ఆయా ప్రాంతాలకు సాగు నీరు అందేలా మైనర్లు, సబ్ మైనర్లు, క్రాస్ రెగ్యులెటర్ల నిర్మాణం చేపట్టారు. ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, ఓటీల ద్వారా యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని 1,65,500 ఎకరాలకు సాగు నీరందనుంది. ఇందులో యాదాద్రి భువనగిరిలో 1,63,175, నల్లగొండ జిల్లాలో 2,325 ఎకరాలు ఉన్నాయి.