ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈ నెల 1న పలువురు మంత్రులతో కలిసి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అందులో భాగంగా దండు మల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. సర్వే నంబర్ 617లోని వంద ఎకరాల్లో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) లేఅవుట్ను కూడా సిద్ధ్దం చేసింది. వచ్చే నెలలో పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. భూమి పూజ కాగానే ఆ స్థలంలో ఉన్న గుట్టలను తొలగించి అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నియమాల ప్రకారం ఒక్కో పరిశ్రమకు అరెకరం, ఎకరం, రెండు ఎకరాలకు పైగా స్థలం ఇవ్వనున్నారు. శంకుస్థాపన చేసిన వెంటనే పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే 30 పరిశ్రమలకు ముందుస్తు దరఖాస్తుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించినట్లు తెలుస్తున్నది. ఈ పరిశ్రమలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 10వేల మందికి ఉపాధి కలుగనుంది. మరో వైవు ఈ ప్రాంతం ప్రగతిలో పరుగులు తీయనుంది. అయితే.. వచ్చేవన్నీ కాలుష్య రహిత పరిశ్రమలే కావడంతో సమీప ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
460 ఎకరాల్లో 455 పరిశ్రమలు
టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశంలోనే తొలిసారిగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దండు మల్కాపురంలో 460ఎకరాల్లో అభివృద్ధి చేయగా.. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 455 పరిశ్రమలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 50పరిశ్రమలు ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. యాదాద్రి ఫుడ్ పార్కు, ఐఓసీ టెర్మినల్తోపాటు ఇంకొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. బీపీసీఎల్ టెర్మినల్ రానుంది. ఇప్పుడు బొమ్మల పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కానుంది.
చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం బొమ్మల తయారీ పరిశ్రమలకు వేదిక కానుంది. దండు మల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్కులో ఇప్పటికే తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) లేఅవుట్ను సిద్ధం చేసింది. ఒక్కో పరిశ్రమకు అరెకరం నుంచి రెండు ఎకరాల వరకు స్థలం ఇవ్వనుండగా.. ఇందుకోసం వంద ఎకరాలు కేటాయించారు. ఈ పరిశ్రమ ఏర్పాటు పనులకు వచ్చే నెల శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది.
తెలంగాణ హస్తకళల జోడింపుతో బొమ్మల తయారీ
నూతన ఒరవడిని జోడించి బొమ్మలను తయారు చేసేందుకు ఈ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ బొమ్మలు, కాటన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్కు సంబంధించిన బొమ్మల తయారీ పరిశ్రమలు రానున్నాయి. తెలంగాణ హస్తకళలను జోడించి వీటిని తయారు చేయనున్నారు. తద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బొమ్మలు చైనా, జపాన్, జర్మనీ నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. స్థానికంగా బొమ్మల తయారీతో విదేశాల నుంచి వాటి దిగుమతి తగ్గనుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నిరుద్యోగులకు మంచి అవకాశం
బొమ్మల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం సంతోషకరం. వాటి ద్వారా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. ఇప్పటికే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో స్థానికులకు ఉపాధి పెరుగుతున్నది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింత ప్రగతి సాధించనుంది.
– ముప్పిడి మణికంఠ, పెద్దకొండూరు
లే అవుట్ సిద్ధం చేశాం
దండు మల్కాపురంలో వంద ఎకరాల్లో బొమ్మల పరిశ్రమలు రానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే లే అవుట్ కూడా సిద్ధం చేశాం. పనులు ప్రారంభం కాగానే దరఖాస్తులను స్వీకరిస్తాం. వాటి ఆధారంగా బొమ్మల తయారీదారులకు స్థలాలను కేటాయిస్తాం.
– శారద, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్