నల్లగొండ, డిసెంబర్ 17 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఈసారి కూడా వరి పంటే ఎక్కువగా సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల 98 వేల 85 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానుండగా అందులో వరి 11,43, 250 ఎకరాల్లో సాగు కానున్నది. ఇక వేరుశనగ 42,446 ఎకరాల్లో సాగు కానుండగా నువ్వులు 1,975, పెసర 2,975, ఇతర పంటలు 7,439 ఎకరాల్లో సాగు కానున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5,15, 815 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానుండగా సూర్యాపేటలో 4,60,540, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, 21,730 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానున్నాయి. వరి నల్లగొండలో 4,71,250 ఎకరాల్లో సాగు కానుండగా సూర్యాపేటలో 4.52 లక్షలు, యాదాద్రిలో 2.20 లక్షల ఎకరాలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
3.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు ఇండెంట్..
ఈ యాసంగి సీజన్కు ఎరువుల కొరత లేకుండా ముందుస్తుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్లో 3.49 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా ప్రస్తుతం 83,520 మెట్రిక్ టన్నులు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకా 3,40,981 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా వాటికి సంబంధించిన ఇండెంట్ను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా యూరియా 45,356 మెట్రిక్ టన్నులు ఉండగా 1,62,363 మెట్రిక్ టన్నులు కావాలని, డీఏపీ 1,800 ఉండగా 36,263 మెట్రిక్ టన్నులు కావాలని, కాంప్లెక్స్ ఎరువులు 31, 843 మెట్రిక్ టన్నులు ఉండగా 1,07,026 మెట్రిక్ టన్నులు కావాలని, ఎంఓపీ 2,712 ఉండగా 26,295కు ఎస్ఎస్పీ 1,809 ఉండగా 9,034 మెట్రిక్ టన్నులు కావాలని ప్రభుత్వానికి నివేదించారు.
అందుబాటులో విత్తనాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 11.98 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానుండగా అందుకు కావాల్సిన విత్తనాలను ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు. వరి విత్తనాలు బహిరంగ మార్కెట్లో 46 వేల కింటాళ్లు అందుబాటులో ఉంచారు. అలాగే వేరుశనగ, నువ్వులు, పెసర విత్తనాలను అందుబాటులో ఉంచారు.
యాసంగి సాగుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నాయి. దీంతో యాసంగి సీజన్కు సంబంధించి సాగులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాం. ఈసారి నల్లగొండలో 5,15,815 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తుండగా అత్యధికంగా వరి 4,71,250 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాం. ఎరువులు ప్రస్తుతానికి ఉన్నవి కాకుండా ఇంకా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టడం జరిగింది.
– సుచరిత, జిల్లా వ్యవసాయ శాఖ, నల్లగొండ